మహిళ సంచలన నిర్ణయం : మరుగుదొడ్డి కోసం మంగళసూత్రాన్నే..
బీహార్ : కూడు, గూడు, గుడ్డ లాగే పరిశుభ్రత దృష్ట్యా మరుగుదొడ్డి అనేది ఓ కనీస అవసరం. అదీగాక పెరుగుతున్న నగరీకరణ పరిస్థితులు, అంతా కాంక్రీట్ జంగిల్ మయం అవుతోన్న నేపథ్యంలో.. ఆ పని కోసం ఆడవాళ్లు బయటకెళ్లడమనేది ఓ తీవ్ర ఇబ్బందిగా పరిణమించింది. ఆ క్రమంలో దాడులు, అత్యాచారాలు జరిగిన ఘటనలు లేకపోలేదు.
అందుకే స్వచ్చ భారత్ లో భాగంగా ప్రభుత్వం నిర్వహించిన ప్రచారానికి.. మరుగుదొడ్లపై జనాల్లో త్వరగా అవగాహన ఏర్పడింది. అందుకే మరుగుదొడ్డి ఉంటే తప్ప పిల్లనివ్వం అన్న వార్తలు తరుచూ దృష్టిలోకి వస్తున్నవే. అయితే మరుగుదొడ్డి కోసం ఏకంగా ఓ మహిళ మంగళ సూత్రాన్నే తాకట్టు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.
బీహార్ లోని రోటాస్ జిల్లా, బరఖన్నా గ్రామానికి చెందిన ఫుల్ కుమారి.. ఇంట్లో మరుగుదొడ్డి లేకపోవడంతో చాలాకాలంగా ఇబ్బందులు పడుతోంది. మరుగుదొడ్డి నిర్మాణానికి ఆర్థిక పరిస్థితి కూడా ఓ అడ్డంకిగా మారింది. దీంతో ఎలాగైనా సమస్యను అధిగమించాలని భావించిన ఆమె చివరికి తాళిబొట్టు అమ్మడమే సరైందని నిర్ణయించుకుంది.

దీంతో ఆమె నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు తప్పుబట్టినా.. అధికారులు మాత్రం ఆమెను అభినందించారు. అంతేకాదు, ఆమె చేసిన పనికి ఏకంగా జిల్లా పారిశుద్ధ్య కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా నియమించాలన్న నిర్ణయానికి వచ్చారు అధికారులు.
భర్త వ్యవసాయ కూలీ.. తాను ఓ పాఠశాలలో వంటమనిషిగా పనిచేసిన చాలీ చాలని జీతంతో టాయ్ లెట్ ను నిర్మించడం కష్టంగా మారింది. అందుకే ఇంట్లో వారి అభ్యంతరాలను పక్కనబెట్టి మరీ టాయ్ లెట్ నిర్మాణం కోసం మంగళసూత్రం తాకట్టు పెట్టింది. అయితే ఆమె చేసిన పనికి సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతుండడంతో ఇంట్లో వాళ్లు కూడా తమ అభిప్రాయం మార్చుకున్నారని తెలుస్తోంది.
దీంతో కుమారి భర్త, ఆమె మామగారు సమక్షంలోనే ఆమె ఇంట్లో టాయిలెట్ నిర్మాణ ప్రారంభోత్సవం జరగబోతుండగా.. కార్యక్రమానికి జిల్లా అధికారులతో పాటు పలువురు జిల్లా స్థాయి ప్రముఖులు హాజరవబోతున్నారు.












Click it and Unblock the Notifications