బీహార్ ఫలితాలు: బీహారీ Vs బాహారీ పని చేసిందా?
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ప్రభుత్వ ఏర్పాటు చేసే విధంగా స్పష్టమైన మెజారిటీ దిశగా సాగుతోంది. బీహార్లోని అన్ని జిల్లాల్లోనూ మహాకూటమి అధిక్యంలో దూసుకుపోతోంది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ఎన్డీఏ ఇంత దారుణంగా ఓటమిని చవిచూడంలో బిహారీ వర్సెస్ బాహరీ అనే నినాదం తోడ్పడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ అభివృద్ధి పేరు చెప్పి ప్రచారం చేయగా, మహాకూటమి, జేడీయూ సీఎం అభ్యర్థి నితీష్ కుమార్ తదితరులు మాత్రం బిహారీ వర్సెస్ బాహరీ అనే ప్రచారాన్ని ఎక్కువగా చేశారు. ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తుంటే ఇది బాగానే పనిచేసిందని అంటున్నారు.
ఎన్నికల ప్రచార ర్యాలీల్లో సీఎం నితీశ్ బీహారీలను ఎన్నుకుంటారా లేక బయటి నుంచి వచ్చిన వారిని ఎన్నుకుంటారా? అంటూ సూటిగా ఓటర్లను ప్రశ్నించారు. ఇదే నినాదం బీహారీల గుండెలను తాకి ఉంటుందని అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో బీహారీ వర్సెస్ బాహరీ నినాదానికి ప్రధాని మోడీ సైతం స్పందించారు.
బాహరీ నినాదాన్ని సీఎం నితీష్ కుమార్ గట్టిగా ప్రచారం చేస్తుండటంతో ప్రధాని మోడీ తాను బాహరీ అయితే, సోనియాగాంధీ ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. ఎగ్జిట్ పోల్స్ సైతం తలకిందులయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ రెండు కూటములకు సమానంగా సీట్లు వస్తాయని అంచనా వేశారు. కానీ మహాకూటమి మాత్రం స్పష్టమైన మెజారిటీని సాధించడం విశేషం.
243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 122 సీట్లు మాత్రమే సాధిస్తే చాలు. ఈ మార్క్ని దాటి మాహాకూటమి స్పష్టమైన మెజారిటీ దిశగా సాగిపోతోంది. తాజా సమాచారం ప్రకారం 160 స్థానాల్లో మాహాకూటమి ఆధిక్యంలో ఉంది.
బీజేపీ గతేడాది సాధించిన 91 సీట్ల కంటే తక్కువ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. 70 సీట్లలో బీజేపీ తన హవాని కొనసాగిస్తోంది. మహాకూటమిలో లాలూ పార్టీ ఆర్జేడీ ముందంజలో ఉంది. గతంలో జరిగిన ఎన్నికల్లో 243 నియోజకవర్గాలున్న బిహార్ అసెంబ్లీలో లాలూ పార్టీ గెలుచుకున్న సీట్లు కేవలం 22.
అప్పట్లో బీజేపీ 91 స్థానాలు, దాని మిత్రపక్షం జేడీయూ 115 స్థానాలు గెలుచుకుని అధికారం చేపట్టాయి. ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో లాలూ బరిలోకి దిగలేదు. తన కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ లను పోటీలో నిలిపారు. ఎన్నికల ఫలితాల మీద కూడా ఆయన గతంలో ఎన్నడూ లేనంత ధీమా వ్యక్తం చేశారు.