వేల కోట్ల ఆస్తికి వారసుడు..! తండ్రి షరతు మీద చెప్పుల దుకాణంలో..
సూరత్ : నేపథ్యం మనిషికి ఓ దృష్టి కోణం ఇస్తే.. అనుభవం జీవితానికి మరో దృష్టి కోణాన్ని ఇస్తుంది. రెండింటి పట్ల పూర్తి స్థాయి అవగాహన ఉన్నపుడే జీవితంపై సరైన స్పష్టత ఏర్పడుతుంది. అందుకే బై బర్త్ గోల్డెన్ స్పూన్ నేపథ్యమున్న తన కొడుక్కి.. ఒక్కసారి బయట ప్రపంచంలోకి వెళ్లి సాధారణ వ్యక్తి లాగా జీవించాలని షరతు పెట్టాడు ఓ బిలియనీర్ తండ్రి.
గుజరాత్ కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి సావ్ జీ ఢోలకియా కుమారుడు ద్రావ్య (21), అమెరికాలో ఎంబీఏ చేస్తూ ఇటీవలే సెలవుల నిమిత్తం ఇంటికొచ్చాడు. అయితే సెలవుల్లో సరదాగా గడపడానికి వచ్చిన తన కొడుక్కు ఓ లైఫ్ టెస్ట్ పెట్టారు ఢోలకియా. అదేంటంటే.. ఇంటికి దూరంగా నెల రోజుల పాటు బయటకు వెళ్లి.. తన పేరు ఎక్కడా ప్రస్తావించకుండా.. ఓ సాదా సీదా యువకుడిలా జీవించాలని కొడుకును అదేశించాడు ఢోలకియా.
అలా.. జూన్ 21వ తేదీన మూడు జతల బట్టలు, రూ.7వేలు ఇచ్చి కొడుకును ఇంటి నుంచి బయటకు పంపించాడు ఢోలకియా. అత్యవసర సమయాల్లో మాత్రమే డబ్బులు ఉపయోగించాలని, ఫోన్ ను అసలు వినియోగించరాదని షరతులు పెట్టి కొడుకును సాగనంపాడు.
మరి బిలియనీర్ కొడుకు.. బయట ప్రపంచంలో అడుగుపెడితే ఎలా ఉంటుంది..? తెర మీద రంగుల సినిమా మాయమై.. ఒక్కసారి బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ దర్శనమైనట్టు ఉంటుంది. సరిగ్గా ఇలాంటి అనుభవాలే కుమారుడు ద్రావ్యకు ఎదురయ్యాయి. తండ్రి ఆదేశానుసారం ఉద్యోగం కోసం వెతికిన అతనికి మొదట్లో ఎవరు పనివ్వలేదు. అసలు ఎప్పుడు చూసిన ముఖం కాకపోడంతో పనిలో పెట్టుకోవడానికి ఎవరు మొగ్గు చూపలేదు.
అయితే జీవితం అన్ని తానే నేర్పిస్తుందన్నట్టు.. మొత్తానికి ఎలాగో అలా ఓ బేకరి షాపులో ఉద్యోగం సంపాదించాడు. ఆ తర్వాత కాల్ సెంటర్, చెప్పుల దుకాణం, మెక్ డొనాల్డ్ లోను పనిచేశాడు. అలా.. నెల రోజుల్లో మొత్తం రూ.4 వేలకు పైనే సంపాదించాడు ద్రావ్య. తండ్రి పెట్టిన షరతులకు లోబడి తన పరీక్షలో నెగ్గిన ద్రావ్య మంగళవారం నాడు ఇంటికి తిరిగొచ్చాడు.
రూ.40 మాత్రం భోజనానికి, రూ.250 లాడ్జి రూమ్ కు మినహా మరే ఇతర ఖర్చులు పెట్టలేదని వెల్లడించాడు ద్రావ్య. ఉద్యోగం నిమిత్తం మొదట్లో మొత్తం 60 చోట్ల వెతగ్గా.. ఒక్కరు పనిలో పెట్టుకోలేదని వాపోయాడు. కాగా, డబ్బు సంపాదన కోసం సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు స్వయంగా అనుభవిస్తే గానీ తెలియదన్న ఉద్దేశంతోనే తన కొడుకుకి ఈ టెస్ట్ పెట్టినట్లు తెలిపారు ఢోలకియా.
అనుభవాన్ని మించిన పాఠం లేదని.. జీవిత పాఠాలు ఏ యూనివర్సిటీలోను చెప్పరని కొడుకుకి పెట్టిన షరతును ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.
ఇక ఢోలకియా విషయానికొస్తే.. వజ్రాల వ్యాపారులకు పేరు గాంచిన సూరత్ లో హరే కృష్ణ డైమండ్ ఎక్స్ పోర్ట్ పేరిట వజ్రాల వ్యాపారం చేస్తున్నారు ఢోలకియా. గతేడాది దీపావళికి తన సంస్థలో పనిచేస్తోన్న ఉద్యోగుల కోసం 491 ఫియట్ కార్లను, 200 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కానుకలుగా ఇచ్చి వార్తల్లోకి ఎక్కారు. దాదాపు 71 దేశాల్లో ఆయన కంపెనీ కార్యకలాపాలు సాగిస్తోండగా.. ఆయన ఆస్తుల విలువ రూ.6000 కోట్లకు పైమాటే.