George Soros: అదానీపై మోడీ జవాబు చెప్పరే-బిలియనీర్ జార్జ్ సోరోస్ ఫైర్-బీజేపీ ఆగ్రహం..
హిండెన్ బర్గ్ నివేదిక నేపథ్యంలో బయటపడిన అదానీ గ్రూప్ అక్రమాలపై ప్రధాని మోడీ మౌనాన్ని ఇప్పటికే దేశంలో విపక్షాలు ప్రశ్నిస్తుండగా.. తాజాగా ప్రపంచ బిలీయనీర్ జార్జ్ సోరోస్ కూడా ఇదే ప్రశ్న వేశారు.
భారత్ లో పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీపై హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత భ్రమలన్నీ తొలగిపోతున్నాయి. హిండెన్ బర్గ్ నివేదికతో అదానీ షేర్లన్నీ కుప్పకూలగా.. దీనిపై ఆయన మిత్రుడిగా భావిస్తున్న ప్రధాని మోడీ మౌనం వహిస్తున్నారు. దీనిపై విపక్షాలు ఇప్పటికే కేంద్రాన్ని టార్గెట్ చేస్తుండగా.. తాజాగా ప్రపంచ బిలియనీర్ జార్జ్ సోరోస్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన జార్జ్ సోరోస్.. తన తాజా ప్రసంగంలో భారత ప్రధాని మోడీని టార్గెట్ చేశారు. అదానీ గ్రూప్ సంక్షోభాన్ని హైలైట్ చేస్తూ సోరోస్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అదానీ గ్రూప్ ఎదుర్కొంటున్న మోసం, స్టాక్ మానిప్యులేషన్ ఆరోపణలపై విదేశీ పెట్టుబడిదారులు, పార్లమెంటు నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు ప్రధాని మోడీ సమాధానం ఇవ్వాల్సిదేనని సోరోస్ వ్యాఖ్యానించారు. అదానీ గ్రూప్ అక్రమాలపై ప్రధాని మోడీ పాటిస్తున్న మౌనం.. కేంద్రంపై ఆయన పట్టును బలహీనపరుస్తుందంటూ సోరోస్ వ్యాఖ్యానించారు. అలాగే భారత్ లో చాలా భవిష్యత్తు సంస్కరణలకు ఇది కారణమవుతుందన్నారు. తాను అమాయకుడిని కావొచ్చని, కానీ భారత్ లో ప్రజాస్వామ్య పునరుద్ధరణను కోరుకుంటున్నట్లు సోరోస్ తెలిపారు.

సోరోస్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ప్రధాని మోడీపై సోరోస్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. ఇది భారత్ పై దాడిగా అభివర్ణించారు. అవలాగే భారత ప్రజాస్వామ్య ప్రక్రియలలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించే విదేశీ శక్తుల పట్ల భారతీయులు ఐక్యంగా స్పందించాలని పిలుపునిచ్చారు. అంతే కాదు సోరోస్ ను ఆర్ధిక యుద్ధ నేరస్తుడిగా ఆమె అభివర్ణించారు. మరోవైపు ఇప్పటికే అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలన్న విపక్షాల డిమాండ్ ను కేంద్రం తోసిపుచ్చుతున్న నేపథ్యంలో సోరోస్ వ్యాఖ్యలు విపక్షాలకు బలంగా మారబోతున్నాయి.












Click it and Unblock the Notifications