అవిశ్వాసం: చిక్కుల్లో కాంగ్రెసు, బిజెపి వెయిటింగ్ గేమ్
బిజూ జనతాదళ్, శివసేన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించాయి. ఇతర పార్టీల మద్దతు కూడా కూడగట్టేందుకు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. బిజెపి మాత్రం వెయిటింగ్ గేమ్ ఆడుతోంది. తెలంగాణపై తప్ప మరే విషయం మీదనైనా అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తామని బిజెపి ప్రకటించింది. అయితే, పూర్తిగా తన వైఖరిని స్పష్టం చేయాల్సి ఉంది.
అవిశ్వాస తీర్మానం చర్చకు రావడానికి కనీసం 50 మంది సభ్యుల మద్దతు అవసరమవుతుంది. అయితే, తాము 84 మంది సభ్యుల మద్దతు కూటగట్టామని తెలుగుదేశం పార్టీ సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా సంఖ్యాబలం పెరుగుతుండడం కూడా కాంగ్రెసు పార్టీని ఆందోళనకు గురి చేస్తోంది.
ఇదే సమయంలో పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ కాంగ్రెసు నాయకత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాంగ్రెసు పార్టీ కొంత కాలం ప్రతిపక్షంలో కూర్చోవాలని, తాజా శాసనసభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పార్టీని పునర్వ్యస్థీకరించాలని ఆయన మంగళవారంనాడు అన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వస్తే చాలా మంది సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు పార్టీని వీడుతారని కూడా అంటున్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీని పెట్టే ఆలోచనలో ఉన్నారని, కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు ఆ పార్టీలో చేరుతారని కూడా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్రపతి వద్ద ఉంది. ఆయన దాన్ని అభిప్రాయం కోసం రాష్ట్ర శాసనసభకు పంపాల్సి ఉంది. దానికి ముందే ఢిల్లీలో రాజకీయాలు వేడెక్కాయి.