పుల్వామా ఉగ్రదాడులు బీజేపీ కుట్రే: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి
గుజరాత్ : గోద్రాలో ఏవిధంగా అయితే బీజేపీ కుట్ర చేసిందో పుల్వామా దాడులు కూడా అదే తరహాలో కమలం పార్టీ చేసిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకరసిన్హ్ వాఘేలా. పుల్వామా దాడికి వినియోగించిన వాహనం గుజరాత్ రిజిస్ట్రేషన్ కలిగి ఉందని ఆయన ఆరోపించారు. ఆ వాహనంలోనే ఆర్డీఎక్స్ ఉన్నట్లు చెప్పారు. కేవలం ఎన్నికల్లో గెలిచేందుకు ఉగ్రవాదంను దేశంలోకి తీసుకొస్తున్నారని వాఘేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో చాలా చోట్ల ఉగ్రదాడులు జరిగాయని గుర్తుచేశారు.
పుల్వామాదాడులకు ప్రతీకారచర్యగా బాలాకోట్లో వైమానిక దాడులు చేశామని చెప్పి ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. బీజేపీ సర్కార్ 200 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని చెబుతోంది కానీ ఒక్క అంతర్జాతీ సంస్థ కూడా ఇది నిరూపించలేకపోయిందని ధ్వజమెత్తారు వాఘేలా. బాలాకోట్ దాడులు ముందస్తు ప్రణాళికలో భాగమే అని చెప్పిన వాఘేలా ఏదో కుట్రకు బీజేపూ తెరదీస్తోందని మండిపడ్డారు. దేశ ఇంటెలిజెన్స్ వ్యవస్థ నుంచి పుల్వామాదాడులపై స్పష్టమైన సమాచారం ఉన్నప్పటికీ ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని చెప్పారు. దాడులు జరుగుతాయని సమాచారం ఉన్నప్పుడు బాలాకోట్ పై ముందుగానే ఎందుకు దాడులు చేయలేదని వాఘేలా ప్రశ్నించారు. పుల్వామా లాంటి ఘటనలు జరగేంతవరకు ఎందుకు వేచిచూశారని ప్రశ్నించారు.
ఎన్నికల్లో గెలుపొందేందుకు బీజేపీ నాటకాలకు తెరతీసిందని మండిపడ్డారు వాఘేలా. ఇక ప్రధాని గుజరాత్ మోడల్ గురించి మాట్లాడుతున్నారని తను చెప్పే మాటలకు గుజరాత్ వాస్తవ పరిస్థితికి సంబంధం ఉండదని అన్నారు. గుజరాత్ రాష్ట్రం కష్టాల ఊబిలో ఉందని చెప్పారు. బీజేపీ పార్టీతో ఆ నేతలే విసుగెత్తి పోయారని అన్నారు. పార్టీలో వారు నిర్బంధానికి గురైనట్లు భావిస్తున్నారు.