సడెన్గా మాట మార్చిన అమిత్ షా.. ఎన్ఆర్సీపై యూటర్న్.. మోడీ ప్రకటన ఫలితమేనా?
''నేను చెప్పే వరుసక్రమాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి.. ముందు పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొస్తాం. దాంతో మూడు పొరుగు దేశాల నుంచి ఇండియాకు వచ్చిన ముస్లిమేతర మతస్తులకు పౌరసత్వం ఇస్తాం. ఆ వెంటనే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ)ని దేశవ్యాప్తంగా అమలు చేస్తాం. భారత్ లో తిష్టవేసిన అక్రమవలసదారుల్ని కచ్చితంగా వెళ్లగొడతాం.. రాసిపెట్టుకోండి.. అతి త్వరలోనే ఇది జరుగుతుంది''.. ఇవీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్ లో, బహిరంగ వేదికలపైనా కొద్దిరోజులుగా పదేపదే చెప్పిన మాటలు.

ఎన్ఆర్సీ ముచ్చటేలేదు..
సీఏఏ, ఎన్ఆర్సీపై దూకుడు ప్రదర్శించిన అమిత్ షా సడెన్ గా మాట మార్చారు. ఇప్పట్లో దేశవ్యాప్త ఎన్ఆర్సీని అమలు చేసే ఆలోచనేదీ కేంద్రానికి లేదని, దానిపై కేంద్ర కేబినెట్ లోగానీ, పార్లమెంట్ లోగానీ చర్చే జరగలేదని, అలాంటి అంశం గురించి ఎవరుకూడా అంతగా ఆందోళన చెందాల్సిన పనిలేదని షా అన్నారు.

ఎన్ఆర్సీకి ఎన్ పీఆర్ కి సబంధంలేదు..
అస్సాంలో తప్ప దేశంలోని మిగతా రాష్ట్రాల్లో జన గణన తరహాలో చేపట్టనున్న ‘నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్ పీఆర్)' ప్రక్రియకు కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. దీని నేపథ్యంలో హోం మంత్రి అమిత్ షా మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ఆర్సీకి, ఎన్ పీఆర్ కి సంబంధమేలేదని, అవి రెండు వేర్వేరు ప్రక్రియలని, ఎన్ పీఆర్ గురించి అనవసరపు అపోహల్ని నమ్మొద్దని షా రిక్వెస్ట్ చేశారు.

మోడీ వల్లే షా వెనక్కి తగ్గారా?
సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటినవేళ.. ఢిల్లీలోని రాంలీలా మైదాన్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన ప్రకటన చేశారు. దేశవ్యాప్త ఎన్ఆర్సీని తీసుకొచ్చే ఆలోచన కేంద్రానికి లేదని, దాని గురించి పరేషాన్ కావొద్దని క్లారిటీ ఇచ్చారు. అప్పటిదాకా ఎన్ఆర్సీపై దూకుడుగా వ్యవహరించిన అమిత్ షా.. మోడీ ప్రకటన తర్వాత తప్పనిసరిగా స్టాండ్ మార్చుకోవాల్సి వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications