పంజాబ్ పోరులో భారీ ట్విస్ట్-ఆప్ కు వ్యతిరేకంగా ఏకమైన బీజేపీ, కాంగ్రెస్, అకాలీదళ్
పంజాబ్ లో రేపు తొలిదశ ఎన్నికలు జరగబోతున్నాయి. వచ్చేనెల 10న రెండో దశ ఎన్నికలు ఉన్నాయి. ఈ రెండింటి మధ్య పెద్దగా తేడా కూడా కనిపించడం లేదు. ఈ రెండు దశల పోరులోనూ మిగతా అన్ని పార్టీల కంటే ఆమ్ ఆద్మీ పార్టీనే ముందున్న సంకేతాలు వెలువడుతున్నాయి. కేజ్రివాల్ వ్యూహాలన్నీ ఫలిస్తుండటంతో ఇప్పుడు ఆయా పార్టీలు ఆప్ ను టార్గెట్ చేసే పనిలో పడ్డాయి. ఇందులోనూ వారంతా కలిసి అడుగులు వేస్తున్నారు.
వాస్తవానికి అధికార కాంగ్రెస్ పార్టీకి గతేడాది వరకూ పరిస్ధితులు అనుకూలంగానే కనిపించినా, ఆ తర్వాత ఆప్ వ్యూహాత్మకంగా వేసిన అడుగులతో ఆ పార్టీకి ఆదరణ పెరిగింది. దీంతో అప్పటికే అంతర్గత కుమ్ములాటలతో సతమతం అవుతున్న కాంగ్రెస్ పార్టీ వెనుకబడింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్ధిగా ప్రస్తుత సీఎం చన్నీనే అధిష్టానం ఎంపిక చేయడంతో ఆ మేరకు ఆయన ప్రత్యర్ధి సిద్ధూ వర్గంలో అసంతృప్తి కనిపిస్తోంది.

అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్లి బీజేపీ-శిరోమణి అకాలీదళ్ తో కలిసి పనిచేస్తున్న అమరీందర్ సింగ్ కూడా సత్తా చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరందరికీ ఇప్పుడు కనిపిస్తున్న ప్రధాన అడ్డంకి ఆప్ మాత్రమే. దీంతో వీరంతా ఉమ్మడిగా ఆప్ ను టార్గెట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.
2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 117 సీట్లున్న పంజాబ్ అసెంబ్లీలో కాంగ్రెస్ 77, ఆప్ 20 సీట్లు గెల్చుకున్నాయి. ఆప్ ప్రధాన విపక్షంగా మారింది.అప్పటి నుంచి ఆప్ క్రమంగా ఎదుగుతూ వచ్చింది. ఇప్పుడు వ్యవసాయ చట్టాల నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు ఆ పార్టీకి మిత్రపక్షాలైన శిరోమణి అకాలీదళ్, పంజాబ్ లోక్ కాంగ్రెస్ కూడా ఆ సెగను ఎదుర్కొంటున్నాయి. దీంతో సహజంగానే పోరు కాంగ్రెస్ వర్సెస్ ఆప్ గా మారింది. దీంతో ఆప్ అందరి లక్ష్యంగా మారింది. ఆప్ ను దెబ్బతీయడం ద్వారా సాధ్యమైనన్ని ఎక్కువ స్ధానాలు గెలిచేందుకు ప్రతీ ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు. కానీ జనాల మనసుల్లో ఏముందో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.












Click it and Unblock the Notifications