మహిళా కార్పొరేటర్ ను చితకబాదిన కాంగ్రెస్ నాయకులు
బెంగళూరు: బెంగళూరులో జరుగుతున్న రోడ్డు పనులను ఆపాలని ప్రయత్నించిన బీజేపీ మహిళా కార్పొరేటర్ మీద కాంగ్రెస్ నాయకురాలు, ఆమె అనుచరులు దాడి చేశారు.
తీవ్రగాయాలైన మహిళా కార్పొరేటర్ మమతా వాసుదేవ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బెంగళూరులోని యశవంతపురం సమీపంలోని మత్తికెరె లో ఎస్ డీఎం కాలనీ ఉంది.
ఈ కాలనీలో ఎంఎల్ ఏ (కాంగ్రెస్) నిధులతో రోడ్డు పనులను స్థానిక కాంగ్రెస్ నాయకురాలు సునంద చేస్తున్నారు. ఆగస్టు 15వ తేదిన సోమవారం మహిళా కార్పొరేటర్ మమతా వాసుదేవ్ అటువైపు వెళ్లారు.
స్వాతంత్ర దినోత్సవం రోజు అందరికి సెలవు కాదా, మీరెందుకు రోడ్డు పనులు చేస్తున్నారు, వెంటనే నిలపండి అని మమతా వాసుదేవ్ అక్కడ ఉన్న కూలీలకు చెప్పారు.
విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకురాలు సునంద తన అనుచరులతో కలిసి రోడ్డు పనులు జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. మహిళా కార్పొరేటర్ మమతా వాసుదేవ్, సునంద మాటా మాటా పెంచుకున్నారు.
ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. అంతే సునందతో సహ ఆమె అనుచరులు మహిళా కార్పొరేటర్ మమతా వాసుదేవ్ మీదదాడి చేశారు.
ఈ దాడిలో గాయాలైన మమతా వాసుదేవ్ అక్కడే స్పృహతప్పి పడిపోయారు. వెంటనే ఆమెను ఎంఎస్ రామయ్య మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు.
సునంద, రాజారెడ్డి తదితరులు తన మీద దాడి చేశారని మమతా వాసుదేవ్, ఆమె భర్త యశవంతపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక శాసన సభ్యుడు మునిరత్న అండచూసుకుని తమ మీద దాడి చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.