బీజేపీ 22, కాంగ్రెస్ 14, ఇండిపెండెంట్లు 26 మంది : ఐదో విడత బరిలో నేరచరితులకే అగ్రతాంబులం
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల బరిలో నేరచరితులకు పార్టీల అగ్రతాంబులం ఇచ్చాయి. అధికార, విపక్ష అని కాక జాతీయ, ప్రాంతీయ పార్టీలు క్రిమినల్ కేసులు ఉన్న నేతలకు టికెట్లు ఇచ్చాయి. ఇక ఐదో విడత ఎన్నికల బరిలో 668 మంది అభ్యర్థులు ఉండగా వారిలో 126 మందిపై వివిధ క్రిమినల్ కేసులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
126 మందిపై క్రిమినల్ కేసులు
మే 6న జరిగే ఐదో విడత పోలింగ్ బరిలో 668 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరిలో 126 మందిపై వివిధ కేసులు ఉన్నాయి. అయితే వీరిలో 22 మంది బీజేపీ అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. బీజేపీ మొత్తం 48 మంది అభ్యర్థులను ప్రకటించగా వారిలో 22 మంది అంటే 46 శాతం మంది నేరచరితులకు టికెట్లను కేటాయించింది. వీరిపై మహిళా, హత్య, కిడ్నాప్ తదితర కేసులు ఉన్నాయి. అంతేకాదు 20 నియోజకవర్గాల్లో ముగ్గురు అభ్యర్థుల చొప్పున క్రిమినల్ కేసులు ఉన్నాయి.
బీజేపీ నుంచి అధికం
ఇక పార్టీలవారీగా చూస్తే బీజేపీ నుంచి 22 మంది, కాంగ్రెస్ నుంచి 14 మంది, బీఎస్పీ నుంచి 9 మంది, ఎస్పీ నుంచి ఏడుగురు, 26 మంది ఇండిపెండెంట్లపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ తెలిపింది. వీరిలో 19 మంది బీజేపీ, 13 మంది కాంగ్రెస్, ఏడుగురు బీఎస్పీ, ఏడుగురు ఎస్పీ, 18 మంది ఇండిపెండెంట్లపై తీవ్ర నేరారోపణలు ఉన్నాయని పేర్కొంది.
14 శాతం మందిపై తీవ్ర అభియోగాలు
668 అభ్యర్థుల్లో 95 మంది అంటే 14 శాతం అభ్యర్థులపై తీవ్ర నేరాభియోగాలు నమోదు చేయబడ్డాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పేర్కొన్నది. మరో ముగ్గురిపై హత్య, 21 మందిపై హత్యాయత్నం, ఐదుగురిపై కిడ్నాపింగ్ కేసులు ఉన్నాయని గుర్తుచేసింది. 9 మందిపై మహిళ వేధింపులు, ఇద్దరిపై లైంగికదాడి, ఐదుగురిపై అసభ్య పదజాలం దూషించారనే అభియోగాలు ఆయా పోలీసు స్టేషన్లలో నమోదయ్యాయి.