బీజేపీ హఠావో.. దేశ్ బచావో: మోడీ సర్కారుపై లాలూ సెటైర్లు, ఎన్నికలపై నితీష్ అదే మాట
ముంబై: కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముంబైలో విపక్ష కూటమి ఇండియా సమావేశం రెండోరోజు భేటీ సందర్భంగా నేతలంతా సంయుక్తగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లాలూ మాట్లాడుతూ.. బీజేపీ హఠావో.. దేశ్ బచావో కోసం మిషన్ మొదలైందని అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా నిత్యావసర వస్తువుల ధరలను చూస్తున్నామన్నారు.
మోడీ సర్కారు పతనం మొదలైందని లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించారు. ప్రజలకు అధిక ధరల నుంచి విముక్తి కలగాలంటే బీజేపీని ఓడించాలన్నారు. కేంద్రం ఒకరిద్దరి కోసమే పనిచేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. ఇంత అహంకార ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని లాలూ వ్యాఖ్యానించారు. భగవంతుడి కంటే తాము గొప్పవాళ్లమనుకుంటున్నారన్నారు.

మోడీ సర్కారును ఇండియా కూటమి భేటీల్లో ఎలాంటి పొరపొచ్చాలూ రాలేదని లాలూ చెప్పుకొచ్చారు. ఇండియా కూటమి నేతలు 140 కోట్ల ప్రజల్ని రక్షించేందుకు వచ్చారని తెలిపారు. భారత్ను సరైన మార్గంలో నడిపించేందుకు ఏకతాటిపైకి వచ్చారని లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు. ఇండియా కూటమిదే విజయమని వ్యాఖ్యానించారు.
జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. విపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తుండటంతో బీజేపీ భయపడుతోందన్నారు. కేంద్రంలో అధికారం కోల్పోక తప్పదన్నారు. ఖచ్చితంగా తెలియకపోయినప్పటికీ.. త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. తామంతా అప్రమత్తంగా ఉండాలని.. ఈ అంశంపైనా కూటమి భేటీలో చర్చించినట్లు చెప్పారు.
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. మోడీ సర్కారు పతనం మొదలైందన్నారు. ఇండియా అనేది కేవలం కొన్ని పార్టీల కూటమి మాత్రమే కాదని.. ఇది నవభారత నిర్మాణాన్ని కోరుకునే 140 కోట్ల మంది ప్రజల కూటమి అని వ్యాఖ్యానించారు. ఈ కూటమిలో ఎవరూ పదవుల కోసం చేరలేదని.. 140 కోట్ల భారతీయుల కోసం అంతా ఏకతాటిపైకి వచ్చామన్నారు. కేంద్రంలోని ప్రభుత్వ అహంకారాన్ని దించుతామన్నారు.
ఇండియా కూటమి భయంతోనే గ్యాస్ ధరలను కేంద్రం తగ్గించిందన్నారు శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ థాక్రే అన్నారు. అంతకుముందు గ్యాస్ ధరలు భారీగా పెంచారని అన్నారు. ఇండియా కూటమిని ఓడించడం సాధ్యం కాదని ఉద్ధవ్ థాక్రే పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. లౌకిక శక్తులన్నీ ఏకతాటిపైకి రావడంతో బీజేపీ ప్రభుత్వం వణికిపోతోందన్నారు సీపీఐ(ఎం) నేత సీతారాం ఏచూరి అన్నారు. దేశ వ్యాప్తంగా బహిరంగ సభలతో ప్రజలను ఏకం చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications