అద్వానీజీ! కష్టకాలంలో మీకు అండగా ఉంటాం: అమిత్ షా
బీజేపీ మీ వెంటే ఉంటుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీకి చెప్పారని తెలుస్తోంది. ఇటీవల బాబ్రీ కేసులో అద్వానీ, ఉమా భారతి, మురళీ మనోహర్ జోషిలపై కుట్ర కేసును తిరగదోడ
న్యూఢిల్లీ: బీజేపీ మీ వెంటే ఉంటుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీకి చెప్పారని తెలుస్తోంది. ఇటీవల బాబ్రీ కేసులో అద్వానీ, ఉమా భారతి, మురళీ మనోహర్ జోషిలపై కుట్ర కేసును తిరగదోడాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కష్టకాలంలో ఉన్న అద్వానికి పార్టీ వెన్నంటే ఉంటుందని అమిత్ షా తెలిపారు. బాబ్రీ పరిణామాల నేపథ్యంలో వచ్చే సవాళ్లను ఎలా ఎదుర్కొవాలో అనే విషయంపై పార్టీ వ్యూహాన్ని ఖరారు చేసింది. అనంతరం ఆయన భాజపా అగ్రనేత అద్వానీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఆయనకు సంఘీభావం తెలిపారు.
అయోధ్యకు వద్దు..
కోర్టు తీర్పు నేపథ్యంలో నేడు అయోధ్య వెళ్లాలని కేంద్రమంత్రి ఉమాభారతి భావించారు. తనపై కుట్ర ఆరోపణలను ఉమాభారతి తిరస్కరించారు. దీనిలో కుట్రకు అవకాశం ఏముందని, అక్కడ రామమందిరం నిర్మించగా చూడాలనేది తన కల అని బహిరంగంగా చెప్పానని వ్యాఖ్యానించారు.
విషయం తెలుసుకున్న అమిత్ షా ఆమెకు ఫోన్ చేసి ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలని కోరారు. అందరూ సంయమనం పాటించాలని అమిత్షా సూచించారు.