ఛాంపియన్లకి మోడీ రెడ్ కార్పెట్, 'చిరంజీవి' ఆపగలరా?
హైదరాబాద్/న్యూఢిల్లీ: ఆయా రాష్ట్రాల్లో బలోపేతం అయ్యేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పైన కూడా ఆ పార్టీ దృష్టి సారించింది. ఆ పార్టీ ప్రధానంగా పలువురు ముఖ్య నేతలకు రెడ్ కార్పెట్ వేస్తున్నట్లుగా కనిపిస్తోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే.. ఎన్నికలకు ముందు, ఆ తర్వాత పలువురు నేతలు బీజేపీలో చేరారు. పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ వంటి ముఖ్య నేతలు కమలతీర్థం పుచ్చుకున్నారు. తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చిన కొణతాల రామకృష్ణ కూడా బీజేపీలో చేరనున్నారనే ప్రచారం సాగుతోంది.
కన్నా, కొణతాల దారిలోనే మరికొందరు బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో మరో అయిదేళ్ల వరకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి అవకాశాలు లేవు! ఇక ఏపీ విషయానికి వస్తే అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది. విపక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది.
కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. సరికదా.. సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ కనిపించే అవకాశాలు కనిపించడం లేదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో మార్గం చూసుకునేందుకు ఎక్కువమంది చూస్తున్నారని అంటున్నారు.
ఇదిలా ఉంటే, పార్టీ బలోపేతంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ సమైక్య ఛాంపియన్లకు రెడ్ కార్పెట్ పరుస్తోందని అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి కూడా పలువురు కమల తీర్థం పుచ్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారనే ప్రచారం సాగుతోంది.
కొణతాల తర్వాత జగన్కు సన్నిహితుడైన నెల్లూరు పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రధానిని, చంద్రబాబును పొగడటం గమనార్హం. అయితే, ఆయన తాను పార్టీని వీడిది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి సమీప భవిష్యత్తులో ఆదరణ లేదని, అందుకే ఆ పార్టీకి చెందిన పలువురు బీజేపీ వైపు చూస్తున్నారని అంటున్నారు.
2019లో మోడీ హవా ఇలాగే ఇప్పుడు ఉన్నట్లుగానే ఉంటుందని చెప్పలేం. దీంతో, ఇప్పటి నుండే వచ్చే ఎన్నికల నాటికి హస్తిన పీఠం దక్కించుకునేందుకు మోడీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పావులు కదుపుతున్నారని అంటున్నారు. ఏపీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు చిరంజీవి మాత్రమే ప్రధాన ఆకర్షణగా ఉన్నారు. కన్నాలా మరికొంతమంది ఎవరైనా కమలతీర్థం పుచ్చుకునేందుకు సిద్దమైతే చిరు ప్రభావం వారిని ఎంత వరకు ఆపగల్గుతుందనే చర్చ సాగుతోంది.