మళ్లీ ఆసుపత్రిలో చేరిన బిజెపి అగ్రనేత ఎల్కే అద్వానీ...
బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వానీ మరోసారి ఆసుపత్రిలో చేరారు. ఆయన మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు అద్వానీని దేశ రాజధాని ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రి లో చేర్పించారు. న్యూరాలజిస్ట్ డాక్టర్ వినిత్ సూరి ఆధ్వర్యంలో ఆయన అడ్మిట్ అయినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇక, న్యూరాలజీ విభాగం నిపుణులు అద్వానినీ నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం బీజెపి అగ్రనేత అద్వానీ వయస్సు 96 యేళ్లు. వృద్దాప్యంలో ఉండడం వల్ల చిన్నపాటి అనారోగ్య సమస్యలు వస్తుంటాయని.. కనుక ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని డాక్టర్లు, నిపుణులు తెలిపారు. అద్వానీ గత నెల (జులై)లో కూడా ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఆయన అంతకుముందు ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో కూడా చికిత్స తీసుకున్నారు. బీజెపి నేత అద్వానీ 2002 నుండి 2004 వరకు ఉప ప్రధానిగా సేవలు చేయడంతోపాటు, 1999 నుండి 2004 వరకు కేంద్ర హోం మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది.

నిలకడగానే ఆరోగ్యం..
ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ.. 'బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ నేటి (మంగళవారం) ఉదయం ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలోని న్యూరాలజీ విభాగంలో అడ్మిన్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిమితంగానే ఉంది. ఆయన్ని న్యూరాలజీ నిపుణులు, వైద్యులు నిశితంగానే పరిశీలిస్తున్నారు' అని అపోలో హాస్పిటల్ డాక్టర్లు పేర్కొన్నారు. అయితే, ఆయన సన్నిహిత కుటుంబసభ్యులు వృద్దాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యల వల్ల ఆయనను ఆసుపత్రిలో చేర్చినట్టు తెలిపారు.












Click it and Unblock the Notifications