బీజేపీ నేతకు ఐఎస్ఐఎస్ బెదిరింపు లేఖ
న్యూఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదుల నుంచి తనకు బెదిరింపులు వచ్చాయని బీజేపీ సీనియర్ నేత షానవాజ్ హూస్సేన్ అన్నారు. న్యూఢిల్లీలోని తన నివాసానికి పోస్టు ద్వారా బెదిరింపు లేఖ వచ్చిందని చెప్పారు.
ఇస్లామిక్ స్టేట్ పేరుతోనే బెదిరింపు లేఖ వచ్చాయని షానవాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉర్దు, ఇంగ్లీష్ బాషల్లో టైప్ చేసి బెదిరింపు లేఖను పంపించారని షానవాజ్ వెల్లడించారు. లేఖలో తనతో పాటు బీజేపీని దూషించారని చెప్పారు.
గతంలో తనకు సోషల్ మీడియా ద్వారా ఇలాంటి బెదిరింపులు వచ్చాయని గుర్తు చేశారు. తనకు వచ్చిన బెదిరింపు లేఖను పోలీసు అధికారులకు అప్పగించానని షానవాజ్ వివరించారు. షానవాజ్ హూస్సేన్ ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించామని డీసీపీ జతిన్ నర్వాల్ చెప్పారు.
బెదిరింపు లేఖ ఎక్కడి నుంచి వచ్చింది అంటూ ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ జతిన్ నర్వాల్ వివరించారు. ఇటీవల వరుసగా ఐఎస్ఐఎస్ సానుభూతి పరులను అరెస్టు చేస్తున్న సమయంలో బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ కు బెదిరింపు లేఖ రావడంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.