మోడీ కోసం రైలు: ఆత్మహత్యే గతంటూ బిజెపి నేత
ఆగ్రా: తన పేరున ఉన్న బకాయి మొత్తాన్ని పార్టీయే చెల్లించాలని.. లేదంటే తనకు ఆత్మహత్యే గతి అని ఉత్తర్ప్రదేశ్లోని ఫతేపూర్ సిక్రీకి చెందిన భారతీయ జనతా పార్టీ నేత వినోద్ సమారియా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రచార ర్యాలీకి కార్యకర్తలను తరలించేందుకు ఓ ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు.
కాగా, ఈ రైలు బుకింగ్ నుంచి కార్యకర్తల తరలింపు ప్రక్రియను సమారియా పర్యవేక్షించారు. అయితే, ఆయన పేరు మీదే రైలును బుక్ చేయడంతో ప్రస్తుతం రూ.12.3లక్షల బకాయిలు చెల్లించాలని రైల్వేశాఖ నుంచి నోటీసులు అందుతున్నాయి.లక్నోలో జరిగే మోడీ సభ కోసం ఏర్పాటు చేసిన ఆ ప్రత్యేక రైలులో ఆగ్రా నుంచి కార్యకర్తలు తరలివెళ్లారు.
తొలుత నిర్ణయించిన ప్రకారం ఈ రైలు అద్దె రూ.18.4లక్షలు. ఈ మొత్తాన్ని పార్టీ ఫండ్ నుంచి చెల్లించారు. తర్వాత నాలుగు చోట్ల కార్యకర్తల కోసం రైలును ఆపాల్సి రావడంతో అదనంగా రూ. 12.3లక్షలు చెల్లించాలని రైల్వేశాఖ సమారియాకు నోటీసులు పంపింది. చేసేదేమీలేక ఈ విషయాన్ని సమారియా స్థానిక నాయకుల దృష్టికి తీసుకెళ్లారు.

వారు స్పందించకపోవడం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీకాంత్ బాజ్పాయ్, కేంద్ర రైల్వేమంత్రి సురేశ్ప్రభులకు లేఖల ద్వారా విజ్ఞప్తి చేశారు. సాధారణ రైతునైన తాను బకాయి చెల్లించలేనని ఆ లేఖల్లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన లక్ష్మీకాంత్ బాజపాయ్.. తొలుత మార్చి31 నాటికి చెల్లిస్తామని, ఇప్పుడు మరో 6నెలలు ఆగాలంటున్నారని సమారియా తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తనకు ఆత్మహత్య తప్ప మరోమార్గం లేదని వాపోతున్నారు.
దీనిపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు లక్ష్మీకాంత్ భాజ్పాయ్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో పలు ప్రత్యేక రైళ్లు వేశామని, వాటి బకాయిలు చెల్లించామన్నారు. ఈ రైలుకు సంబంధించిన బకాయిలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని త్వరలో వాటినీ చెల్లిస్తామని తెలిపారు. అందుకు తాను హామీ ఇస్తున్నానని, త్వరలో సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు. వినోద్ సమరియా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.












Click it and Unblock the Notifications