మోడీ కూర్చున్న కుర్చీ కోసం లక్షల్లో బిడ్లు, ఓనర్ నో
లక్నో: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ కుర్చీ కోసం ఆ పార్టీ నాయకులు పోటీ పడుతున్నారు. కూర్చీ కోసం పోటీ అంటే ప్రధాని పదవి కోసమే లేక 2014 సాధారణ ఎన్నికలలో బిజెపి గెలిచి ఆయన ప్రధాని అయితే గుజరాత్ పీఠం కోసమో కాదు!
మోడీ కూర్చున్న ఓ కూర్చీ కోసం నాయకులు పోటీ పడుతున్నారు. ఉత్తర ప్రదేశ్లో ఇటీవల జరిగిన సభలో మోడీ కూర్చున్న కుర్చీ కోసం నాయకులు వేలం పాడుతున్నారు.
సమాచారం మేరకు బిజెపి ఎమ్మెల్యే జగన్ ప్రసాద్ గార్గ్ ఈ కుర్చీ కోసం రూ.1.25 లక్షల పాట పాడారు. ఎమ్మెల్యే యోగేంద్ర ఉపాధ్యాయ, పార్లమెంటు సభ్యులు రామ్ శంకర్ కఠేరియాలు కూడా లక్ష రూపాయల పాట పాడారు.
మరోవైపు ఈ కార్యక్రమం కోసం కుర్చీలు, ఇతర వస్తువులు సరఫరా చేసిన ప్రమోద్ ఉపాధ్యాయ మాత్రం ఆ కుర్చీని అమ్మేందుకు నిరాకరిస్తున్నారు. దానిని ఆయన తన వద్దే ఉంచుకుంటానని చెబుతున్నారు. ఆయన స్థానిక బిజెపి కార్పోరేటర్.
ఈ వేలం ఓ కార్యకర్త నుండి ప్రారంభమైంది. మోడీ కూర్చున్న కుర్చీని తనకు అమ్మాలని ఓ కార్యకర్త కోరారు. ఆ కుర్చీ కోసం రూ.2 వేలు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. ఆ తర్వాత నాయకులు కుర్చీ కోసం బిడ్ వేయడం ప్రారంభించారు.
మోడీ నవంబర్ 21వ తేదీన అగ్రాలోని కోఠి మీనా బజార్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ఆ సమయంలోనే అతను కూర్చున్న కుర్చీ కోసం గిరాకీ పెరిగింది.