వందే భారత్ ఎక్స్ప్రెస్లపై కేంద్రం కీలక ప్రకటన: మనకు బుల్లెట్ రైలు కేటాయింపు
BJP Manifesto: దేశంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రచార వేడి పతాక స్థాయికి చేరుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ- ఎన్డీఏ, ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గెలిచి తీరాలనే పట్టుదలను ప్రదర్శిస్తోన్నాయి. దీనికోసం అవసరమైన వ్యూహాలను రూపొందించుకున్నాయి.
మొత్తం ఏడు దశల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నెల 19వ తేదీన తొలి విడత పోలింగ్ షెడ్యూల్ అయింది. దీనికి అవసరమైన నామినేషన్ల ప్రక్రియ సైతం పూర్తయింది. తమిళనాడు సహా మొత్తం 13 రాష్ట్రాల్లో 89 లోక్సభ నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ జరుగుతుంది. జూన్ 1వ తేదీ నాటితో ఏడు దశలో పోలింగ్ ముగుస్తుంది. అదే నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది.

తొలి విడత పోలింగ్ పోలింగ్ సమీపించిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మేనిఫెస్టో సంకల్పపత్రను ప్రకటించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దీన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ సహా పలువురు కేంద్రమంత్రులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
మేనిఫెస్టోను విడుదల చేసిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడారు. కేంద్రంలో తమ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను మరింత విస్తరింపజేస్తామని హామీ ఇచ్చారు. రైల్వే స్టేషన్ ఉన్న ప్రతి ప్రాంతాన్నీ అనుసంధానించేలా వందే భారత్ రైళ్లను తీసుకొస్తామని అన్నారు.

మున్ముందు మూడు రకాల వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను నడిపిస్తామని మోదీ చెప్పారు. వందే భారత్ స్లీపర్, వందే భారత్ ఛైర్ కార్, వందే భారత్ మెట్రో రైళ్లు ప్రయాణికుల కోసం అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అలాగే- మూడు బుల్లెట్ రైళ్లను కూడా నడిపిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఒక బుల్లెట్ రైలు ఉత్తరాది రాష్ట్రాలకు, మరో బుల్లెట్ రైలు దక్షిణాది రాష్ట్రాల్లో పట్టాలపై పరుగులు పెడుతాయని మోదీ తేల్చి చెప్పారు. ఇంకొక బుల్లెట్ రైలును ఈశాన్య రాష్ట్రాల్లో రాకపోకలు సాగిస్తుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన సర్వే, ఇతర పనులు త్వరలోనే మొదలవుతాయని తెలిపారు మోదీ.












Click it and Unblock the Notifications