చస్తే సారీ చెప్పను: బీజేపీ ఎంఎల్ఏ
భోపాల్: మధ్యప్రదేశ్ లో బీజేపీ శాసన సభ్యుడు ఊగిపోయాడు. స్వయంగా రాళ్లు రువ్వి, కర్ర తీసుకుని టోల్ ప్లాజా నిర్వహకులపై దాడి చేశారు. అయితే ఆయన మీద కేసు నమోదు చెయ్యవలసిన పోలీసులు టోల్ ప్లాజా సిబ్బంది మీద కేసులు నమోదు చేశారు.
మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ శాసన సభ్యుడు కాలు సింగ్ ఠాకూర్, అతని అనుచరులు భోపాల్ లోని ఓ టోల్ ప్లాజా దగ్గరకు వెళ్లారు. వారి వాహనాలు నిలిపిన సిబ్బంది టోల్ ఫీజు చెల్లించాలని మనవి చేశారు. ఆ సందర్బంలో కాలు సింగ్ అనుచరులు వాహనాలు దిగారు.
టోల్ సిబ్బంది మీద దాడి చేశారు. అంతసేపు కారులో ఉన్న కాలు సింగ్ కు కాలిపోయింది. ఆయన కారు దిగి కింద ఉన్న రాళ్లు తీసుకుని టోల్ ప్లాజా మీదకు విసిరారు. చేతికి చిక్కిన కర్ర తీసుకుని టోల్ ప్లాజా సిబ్బంది మీద దాడి చేశారు.
తాను ప్రజా ప్రతినిధినినని, తననే టోల్ ఫీజు కట్టమని అడుగుతారా అని ఊగిపోయారు. ఈ హంగామా అంతా అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. ఎదో అనుకోకుండా జరిగిపోయిందని క్షమాణ చెప్పి చేతులు దులుపుకోవాలని పెద్దలు, పోలీసు అధికారులు సూచించారు.
అయితే నన్నే క్షమాపణ చెప్పమంటారా, మీకు ఎంత ధైర్యం అని కాలు సింగ్ అంటున్నారు. ప్రాణం పోయినా క్షమాపణ చెప్పను అని తేల్చి చెప్పారు. తన మీద దురుసుగా ప్రవర్తించారని టోల్ నిర్వహకుల మీద ఎంఎల్ఏ కాలు సింగ్ ఠాకూర్ కేసు పెట్టారు.