సభలో బీజేపీ సభ్యుల బైఠాయింపు: రాత్రంతా ధర్నా కొనసాగించాలని నిర్ణయం!
బెంగళూరు: అనూహ్యం! బలపరీక్ష నిర్వహించకుండానే కర్ణాటక శాసనసభ సమావేశాలు శుక్రవారం నాటికి వాయిదా పడ్డాయి. గురువారం సాయంత్రం సభలో అధికార కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సభ్యులు పతాకస్థాయిలో ఆందోళన చేపట్టారు. తమ శాసన సభ్యుడు శ్రీమంత్ బాలాసాహెబ్ పాటిల్ను భారతీయ జనతాపార్టీ నాయకులు కిడ్నాప్ చేశారంటూ పెద్ద ఎత్తున గందరగోళానికి తెర తీశారు. దీనికితోడు- గురువారం నాటికే బలపరీక్షను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ గవర్నర్ వజూభాయ్ వాలా స్పీకర్కు ఆదేశాలను జారీ చేయడాన్ని తప్పుపట్టారు. శాసనసభ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకోవడం సరికొత్త సంప్రదాయానికి తెర తీసినట్టవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

బిత్తరపోయిన బీజేపీ..
ఈ రెండు అంశాలను అడ్డుగా పెట్టుకున్న అధికార పక్షం సభలో పెద్ద ఎత్తున గందరగోళానికి తెర తీసింది. ఫలితంగా- స్పీకర్ రమేష్కుమార్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. అనుకోకుండా చోటు చేసుకున్న ఈ ఉదంతంతో ప్రతిపక్ష బీజేపీ ఖంగు తిన్నది. గురువారమే బలపరీక్షను నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. దీనికి భిన్నంగా సభ వాయిదా పడటాన్ని జీర్ణించుకోలేకపోయింది. సభ వాయిదా పడినప్పటికీ.. బీజేపీ శాసన సభ్యులు లోపలే బైఠాయించారు. తాము బయటికి వచ్చేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. రాత్రంతా ఆందోళన చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

గవర్నర్ సందేశానికి స్పీకర్ బదులివ్వాల్సిందే..
గవర్నర్ వజూభాయ్ వాలా అధికారికంగా పంపించిన సందేశానికి స్పీకర్ రమేష్ కుమార్ తప్పనిసరిగా బదులు ఇచ్చి తీరాలని ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప పట్టుబట్టారు. స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడించేంత వరకూ తాము సభను వదిలి వెళ్లబోమని చెప్పారు. ఏ ఒక్క సభ్యుడు కూడా సభ నుంచి బయటికి వెళ్లబోడని, స్పీకర్ వెంటనే సభను మరోసారి సమావేశ పర్చాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. గవర్నర్ స్థానాన్ని సైతం కాంగ్రెస్-జేడీఎస్ నాయకులు కించపరుస్తున్నారని ఆరోపిస్తున్నారు. బలపరీక్ష నిర్వహణపై గవర్నర్ స్పష్టమైన ఆదేశాలను అందజేశారని, దాన్ని స్వయంగా తానే సభలో చదివి వినిపించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయినప్పటికీ- స్పీకర్ వాటిని బేఖాతర్ చేశారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ధ్వజమెత్తారు. గవర్నర్ స్థానాన్ని అవమానించారని యడ్యూరప్ప మండిపడ్డారు.

శాసనసభ వ్యవహారల్లో గవర్నర్ జోక్యమా?
అంతకుముందు- ఇదే అంశంపై కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. శాసనసభా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తగదని అంటున్నారు. గవర్నర్ పక్కా భారతీయ జనతాపార్టీ నాయకుడిగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. తమ ఎమ్మెల్యేను కిడ్నాప్ చేసిన విషయం గవర్నర్కు తెలియదా? అని మండిపడుతున్నారు. సుప్రీంకోర్టు నుంచి నిర్దేశిత లిఖతపూరక ఆదేశాలు గానీ, ఉత్తర్వులు గానీ అందనప్పటికీ- శాసనసభలో బలపరీక్షను నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధం కాదా? అని కాంగ్రెస్ సభ్యులు గవర్నర్ వజూభాయ్ వాలాను నిలదీస్తున్నారు. శాసనసభ నియమ, నిబంధనల ప్రకారమే బలపరీక్ష కొనసాగుతుందే తప్ప గవర్నర్ సూచనల మేరకు కాదని విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications