ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం, దిశానిర్దేశం చేయనున్న మోడీ
బీజేపీ జాతీయ కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం సోమవారం ఢిల్లీలో ప్రారంభమైంది.
న్యూఢిల్లీ : బీజేపీ జాతీయ కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం సోమవారం ఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రులు, పలువురు సీనియర్ నేతలతో పాటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
ఈ సమావేశంలో ఉద్యోగాలు, జీడీపీ అంశాలతో పాటు.. పార్టీ యంత్రాంగం బలోపేతం, రానున్న 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2019 ఎన్నికలే లక్ష్యంగా చర్చిస్తున్నారు. సమావేశం ముగింపు సమయంలో సాయంత్రం ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఇవాళ కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. మందగించిన దేశ ఆర్థిక పరిస్థితి, త్వరలో మరో విడత అసెంబ్లీ ఎన్నికలతో పాటు భవిష్యత్ వ్యూహాలే లక్ష్యంగా జాతీయ కార్యవర్గ సమావేశాలు ఢిల్లీలో జరుగుతున్నాయి. నరేంద్ర మోడీ మూడేళ్ల పాలన తదుపరి వ్యూహాలపై ఈ సమావేశాల్లో చర్చలు నిర్వహిస్తున్నారు.
ఈ సమావేశాల్లో నరేంద్ర మోడీ సుదీర్ఘ ప్రసంగం చేయనున్నారు. జీడీపీ వృద్ధి రేటు రెండు శాతం పడిపోవడంతో ప్రతిపక్షాలు మోడీని తీవ్రంగా విమర్శిస్తున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ, జీఎస్టీ, రోహింగ్యాలు తదితర అంశాలపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది.
ఆర్థిక రంగంలో కేంద్ర ప్రభుత్వం ఇంత వరకు సాధించిందేమిటి?... మౌలిక సదుపాయాల కల్పనకు చేపట్టిన కార్యక్రమాలతో పాటు మూడేళ్లుగా సర్కారు చేసిందేమిటి అన్న దానిపై సమాధానం ఇవ్వనున్నారు.
పెద్దనోట్ల రద్దులాంటి నిర్ణయాల వల్ల దేశానికి కలిగిన ప్రయోజనాన్ని కూడా మోడీ వివరించబోతున్నారు. పేదల సంక్షేమానికి చేపట్టిన పథకాలపై ఓ రిపోర్టు కార్డును ప్రజల ముందు ఉంచనున్నారు.
మోడీ స్వరాష్ట్రం గుజరాత్లో జరిగే శాసనసభ ఎన్నికలు ఆయనతో పాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్షాకు కూడా ప్రతిష్టాత్మకంగా మారాయి. దీనికితోడు హిమాచల్ ప్రదేశ్లో శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నారు.
జీఎస్టీ వల్ల దేశానికి కలిగిన ప్రయోజనాన్ని కూడా వివరిస్తూ మోడీ జీఎస్టీని సమర్థించబోతున్నారు. త్వరలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో విపక్షాలను సమర్థవంతంగా ఎదుర్కోవడంపై కూడా ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.