రాష్ట్రపతి ఎన్నిక: ఒక దాగుడుమూతలాట, పోటీ తప్పదా?
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వచ్చేనెలలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల కోసం తమదైన శైలిలో ఆటకు దారి తీసింది.
న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వచ్చేనెలలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల కోసం తమదైన శైలిలో ఆటకు దారి తీసింది. మూడేళ్ల క్రితం లోక్ సభ ఎన్నికలు మొదలు.. విపక్షాల మధ్య అనైక్యతతో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం ప్రధాని నరేంద్రమోదీ, ఆయన సన్నిహిత మిత్రుడు - బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా జోడీ ఆత్మ విశ్వాసం ఇనుమడించింది.
దాని ఫలితంగానే రాష్ట్రపతి ఎన్నికల్లో ఏకాభిప్రాయ మంత్రం జపిస్తోంది. అందులో భాగంగా అమిత్ షా ముగ్గురు కేంద్రమంత్రులతో ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుల చేపట్టిన ప్రక్రియ దాగుడుమూతలకు దారి తీసింది. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీల అధినేతలతో సంప్రదింపులు జరిపిన త్రిసభ్య కమిటీ సభ్యులు రాజ్ నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు.. రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థి పేరు ప్రతిపాదించలేదు. అభ్యర్థి పేరు ప్రతిపాదించకుండానే చర్చలేమిటని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తదితరులు బీజేపీ కమిటీని నిలదీశారు.
నాలుగు రోజుల తర్వాత మళ్లీ వస్తామని పేర్కొంటూ కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు వెళ్లిపోయారు. 2002లో రాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు నాటి బీజేపీ ప్రభుత్వం, అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి రకరకాల ప్రతిపాదనలు ముందుకు తెచ్చారు. తొలుత జగ్మోహన్.. తర్వాత పీసీ అలెగ్జాండర్ పేరు ప్రస్తావనకు తెచ్చినా చివరకు అణు శాస్త్రవేత్త ఎపిజె అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఎన్నిక అయ్యారు.

వ్యూహాత్మకంగానే విపక్షాలు
కానీ ఈ దఫా బీజేపీ తన మనస్సులో మాట బయట పెట్టకుండా రంగంలోకి దిగింది. కాంగ్రెస్ పార్టీ సహా ఇతర విపక్షాలూ వ్యూహాత్మకంగానే ముందుకు సాగుతున్నాయి. బీజేపీ వ్యూహాత్మక ఎత్తుగడలకు ప్రతిగా వ్యూహం రూపొందించుకున్నాయి. ఈ దశలో గుజరాత్ గవర్నర్ ద్రౌపది ముర్ము, విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. తాజా మెట్రో రైలు స్రుష్టికర్త శ్రీధరన్ పేరు చర్చకు వచ్చింది. మరో ఆసక్తికర పరిణామం ఏమిటంటే ఎన్డీయే మిత్రపక్షం శివసేన.. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ అభ్యర్థిత్వం కాకపోతే వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ పేరును ముందుకు తెచ్చింది.

విపక్షాలను దెబ్బతీయడమే కమలనాథుల వ్యూహం
కానీ అధికారికంగా ఈ నెల 20న అభ్యర్థి పేరును ప్రకటించేందుకు ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రంగం సిద్ధం చేసుకున్నారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో ప్రతిపక్షాలు తమతో కలసి వస్తాయన్న నమ్మకం పాలకపక్షమైన బీజేపీకి ఇసుమంతా కూడా లేదు. కేవలం కాలయాపన చేయడానికి ఈ తతంగం, ఈ కసరత్తు అంతా. రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్లు దాఖలు చేయాల్సిన ఆఖరి తేదీ జూన్ 28వ తేదీకాగా ఎన్నికలు జూలై 17వ తేదీన జరుగుతాయి. చివరి వరకు ప్రతిపక్షాలను సరైన అభ్యర్థి ఎన్నుకోకుండా ఏదోరకంగా వారితో సంప్రదింపుల పేరిట కాల యాపన చేయడమే కమలనాథుల వ్యూహంగా ఉన్నది.

గోపాల కృష్ణ గాంధీ పేరు ఖాయమే?
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సహా ప్రతిపక్ష నాయకులేమీ కసరత్తు పేరిట కాలయాపన చేయడానికి అమాయకులు కాదు. ప్రతిపక్షాలకు చెందిన పది మంది సభ్యుల కమిటీ రెండు రోజుల క్రితం సమావేశమై తమ పక్షం నుంచి రాష్ట్రపతి అభ్యర్థికి పలువురి పేర్లను పరిశీలించింది. జాతిపిత మహాత్మాగాంధీ మనుమడు, సీ రాజగోపాలచారి బంధువు, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాల కృష్ణ గాంధీ అభ్యర్థిత్వం పట్ల ప్రతిపక్షంలో ఏకాభిప్రాయం కుదిరే అవకాశం ఉంది.

అధికార, విపక్షాల వ్యూహం ఎవరిది వారిదే
ఇప్పటికే జాతిపిత మహాత్మాగాంధీని ‘చతుర్ బనియా' అంటూ విమర్శించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రతిపక్షంతో కలసివచ్చే అవకాశం ఏమాత్రం లేదు. లౌకిక భావాలు కలిగిన వ్యక్తిని తప్పా మరొకరి పేరును పాలకపక్షం ప్రతిపాదిస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని లలూ ప్రసాద్ యాదవ్ స్పష్టం చేయడం, ఆ మాటకు వామపక్షాలు మద్దతు పలకడం తెల్సిందే. మరో లౌకిక అభ్యర్థిని పాలకపక్షం ప్రతిపాదించినా ప్రతిపక్షం, ప్రతిపక్షం ప్రతిపాదిస్తే అంగీకరించేందుకు బీజేపీ సిద్ధంగా లేదు.

బీజేడీ నేత నవీన్ పట్నాయక్కు ఇలా విపక్షం గాలం
పాలకపక్షానికి తన అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరమైన ఓట్లు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీలతోపాటు తమిళనాడులోని అన్నాడీఎంకే వర్గాలు తమకు మద్దతిస్తాయని బీజేపీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఒరిస్సాలో అధికారంలో ఉన్న బీజూ జనతాదళ్ పార్టీ బీజేపీవైపు మొగ్గు చూపకుండా ఉండేందుకు ప్రతిపక్షాలు ఇప్పటికే ఆయనతో టచ్లో ఉన్నాయి. రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై ప్రతిపక్షం కలసిరాకుండా పోటీకి సిద్ధమైనందున తాము పోటీకి సిద్ధపడాల్సి వచ్చిందని పాలకపక్షం బీజేపీ, పాలకపక్షం ప్రతిపాదించిన అభ్యర్థి తమకు నచ్చకపోవడం వల్ల పోటీ అనివార్యమైందని ప్రతిపక్షం అంతిమంగా చెప్పేది. మరి ఇరువర్గాల నుంచి ఈ కసరత్తు ఎందుకు? 2019 సార్వత్రిక ఎన్నికల లక్ష్యంగా రాష్ట్రపతి ఎన్నికల పేరిట ప్రతిపక్షాలను కూడగట్టడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యంకాగా, రాష్ట్రపతి ఎన్నికల్లోనే ప్రతిపక్షాలను ఘోరంగా చిత్తు చేయడం ద్వారా వారి భవిష్యత్ ప్రణాళికలను తుంచివేయడం కమలనాథులు వేసుకున్న ప్రణాళిక.

ప్రతిభ, ప్రణబ్లకు శివసేన, జేడీయూ మద్దతు ఇలా
ఆ మాటకొస్తే 1977లో నీలం సంజీవ రెడ్డిని మినహాయిస్తే ఇంతవరకు ఏ రాష్ట్రపతి కూడా ఏకగ్రీంగా ఎన్నికకాలేదు. వాస్తవానికి నీలం సంజీవరెడ్డిని జనతా పార్టీ ప్రతిపాదించగా ఆ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినందున నీలంను కాంగ్రెస్ పార్టీ సమర్థించాల్సి వచ్చింది. 2002లో అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజపేయి, రాష్ట్రపతి అభ్యర్థిగా అబ్దుల్ కలాం ఆజాద్ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు తీవ్రంగా కృషి చేశారు. కలాం అభ్యర్థిత్వానికి కాంగ్రెస్, సమాజ్వాది పార్టీలు మద్దతిచ్చినా, వామపక్షాలు కెప్టెన్ లక్ష్మీ సెహగల్ను నిలబెట్టాయి. అలాగే ప్రతిభాపాటిల్, ప్రణబ్ ముఖర్జీ విషయంలో కాంగ్రెస్ కూడా శివసేన. జేడీయూ లాంటి పార్టీల మద్దతును కూడగట్టాయి. ఇప్పుడు ఆ అవకాశం లేదు. ప్రణబ్ ముఖర్జీ పేరునే పాలకపక్షం ప్రతిపాదిస్తే పరిస్థితి వేరుగా ఉండవచ్చు. దేశ చరిత్రలో తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ మాత్రమే రెండు సార్లు పోటీ చేసి, రెండు సార్లు విజయం సాధించారు.












Click it and Unblock the Notifications