రెచ్చగొట్టే వ్యాఖ్యలు: బీజేపీ చీఫ్ అమిత్ షాపై ఛార్జీషీట్
లక్నో: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా పైన ఛార్జీషీటు దాఖలైంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ పోలీసులు ఈ ఛార్జీషీట్ దాఖలు చేశారు. గత ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఆయన పైన ఛార్జీషీట్ దాఖలు చేశారు.
ఏప్రిల్ 4వ తేదీన జరిగిన ఓ సభలో ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చేశారు. ఆయన ప్రసంగం చేసిన తాలూకు వీడియో క్లిప్పింగుల ఆధారంగా వారు ఈ కేసు నమోదు చేశారు.
బిజ్నోర్, షామ్లీలలో రెండు చోట్ల వేర్వేరుగా ఆయన పైన కేసులు నమోదయ్యాయి. బిజ్నోర్, షామ్లీలలో జరిగిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది జరగిన ఘర్షణల నేపథ్యంలో ఈసారి బీజేపీకి ఓటు వేయడం ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా, సార్వత్రిక ఎన్నికల సమయంలో అమిత్ షా బీజేపీ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి ఇంచార్జిగా ఉన్నారు. యూపీలో అత్యధిక ఎంపీ సీట్లను గెలిపించుకునే బాధ్యత ఆయన పైన మోడీ ఉంచారు. ఉత్తర ప్రదేశ్లో బీజేపీ 73 స్థానాలు గెలుచుకుంది. ఎన్నికల అనంతరం ఆయన బీజేపీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు.