కర్ణాటక సీఎంపై అమిత్ షా ఫైర్: కన్నడ అనువాదంతో తుస్, బీజేపీదే అధికారం !
Recommended Video
బెంగళూరు: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కర్ణాటక ప్రభుత్వం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య మీద నిప్పులు చెరిగారు. సిద్దరామయ్య ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వమని, మత రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ చీఫ్ అమిత్ షా విమర్శించారు. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హోలల్ కేరెలో పర్యటించిన అమిత్ షా కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మీద హిందీలో తీవ్రస్థాయిలో విరుచుకుపడినా కన్నడ బాషలోకి అనువాదం చెయ్యడంతో అది తుస్సుమంది.
భారత వ్యతిరేకి
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని అమిత్ షా ఆరోపించారు. భారత వ్యతిరేక సంస్థ అయిన సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్ డీపీఐ) మీద నమోదైన కేసులు ఎందుకు ఎత్తివేశారని బీజేపీ చీఫ్ అమిత్ షా సీఎం సిద్దరామయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కాంగ్రెస్ జల్సా చేస్తోంది
కేంద్ర ప్రభుత్వం కర్ణాటకకు మంజూరు చేస్తున్న నిధులు ఎక్కడికి పోతున్నాయని, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు పూరి గుడిసెల్లో ఉన్న ఆ పార్టీ కార్యకర్తలు ఇప్పుడు బహుల అంతస్తుల ఇళ్లు కట్టుకొన్నారని, ఇంటి ముందు ఖరీదైన కార్లు పార్క్ చేసుకుంటున్నారని, అవినీతికి పాల్పడకపోతే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని అమిత్ షా సీఎం సిద్దరామయ్యను ప్రశ్నించారు.
సీఎంకు తెలీదా ?
కేంద్ర ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రానికి ఏమి చేసింది అంటూ మీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రశ్నిస్తున్నారని అమిత్ షా గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రానికి ఏమి చేసింది అనే విషయం చెప్పడానికే తాను ఇక్కడికి వచ్చానని, సరైన సమాధానం ఇస్తానమి అమిత్ షా అన్నారు.
యూపీఏ, ఎన్డీఏకి అదే తేడా
13వ ఫైనాన్స్ కమిషన్ లో భాగంగా అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం కర్ణాటకకు రూ. 88, 583 కోట్లు మంజూరు చేసిందని అమిత్ షా గుర్తు చేశారు. 14వ ఫైనాన్స్ కమిషన్ లో భాగంగా ఇప్పడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కర్ణాటకకు 2 లక్షల 19 కోట్లు నిధులు మంజూరు చేసిందని, ఆ నిధులు సిద్దరామయ్య ప్రభుత్వం ఏమి చేసిందని అమిత్ షా సూటిగా ప్రశ్నించారు.
మెట్రో రైల్వే స్టేషన్లలో !
గత ఏడాది బెంగళూరు మెట్రో రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన హిందీ, ఇంగ్లీష్ బాషల బోర్డులను కన్నడ సంఘాలు తొలగించిన విషయం తెలిసిందే. ఆ సందర్బంలో కన్నడ, ఇంగ్లీష్ బాషల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చెయ్యాలని స్వయంగా సీఎం సిద్దరామయ్య కేంద్ర ప్రభుత్వానికి మనవి చేశారని ఇదే సందర్బంలో అమిత్ షా గుర్తు చేశారు.
ఎవరు కావాలి
మీరు కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బు తీసుకుని ఓట్లు వేస్తున్నారా ? లేదు కదా, ఎందుకు ఆ పార్టీకి ఓట్లు వెయ్యాలి, సామాన్య ప్రజలు, రైతులు, కూలీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి సహాయం చేసిందని అమిత్ షా ప్రజలను ప్రశ్నించారు. మీకు కాబోయే ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప అని బీజేపీ చీఫ్ అమిత్ షా జోస్యం చెప్పారు.
అనువాదంతో దెబ్బ
అమిత్ షా హిందీలో మాట్లాడితే ఆ మాటలను కర్ణాటక మాజీ మంత్రి, బెంగళూరులోని మహదేవపుర నియోజక వర్గం బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలి కన్నడలోకి అనువాదం చేశారు. అయితే అమిత్ షా స్పీచ్ కు, కన్నడ అనువాదానికి పొంతన లేకపోవడంతో బీజేపీ చీఫ్ అమిత్ షా ప్రసంగానికి పెద్దగా స్పందనలేకపోయింది. కర్ణాటక సీఎం సిద్దరామయ్యను అమిత్ షా తీవ్రస్థాయిలో విమర్శించినా ప్రజలకు మాత్రం అర్థం కాలేకపోయింది.