ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసం ఎదుట బీజేపీ భారీ నిరసన.. ప్రధాన డిమాండ్ ఇదే!!
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన అరవింద్ కేజ్రీవాల్ ను బీజేపీ టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. పంజాబ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది. దీంతో బీజేపీ ఆప్ పై దాడిని పెంచింది. ఈ నేపథ్యంలో ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ నివాసం ముందు భారీ ఆందోళన చేపట్టింది. ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో, ఇంధనధరలపై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఢిల్లీ యూనిట్ శనివారం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం ఎదుట భారీ నిరసనకు దిగింది. దీంతో అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వేస్తున్న ఇంధన పన్నులు తగ్గించాలని బీజేపీ నేతలు కార్యకర్తలు అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ముందు భారీ ఆందోళనకు దిగారు. ఇక కేజ్రీవాల్ ఇంటి వైపు దూసుకు వచ్చేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలను అడ్డుకోవడానికి పోలీసులు భారీగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

అంతకుముందు, పెరుగుతున్న ఇంధన ధరలపై ప్రధాని నరేంద్ర మోడీ తన మొదటి ప్రతిస్పందనగా, కొన్ని రాష్ట్రాలు ఇంధన పన్నులను తగ్గించలేదని చెప్పారు. ఆ రాష్ట్రాలు ఇప్పుడు పన్నులు తగ్గించాలని కోరారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, జార్ఖండ్ వంటి రాష్ట్రాలు ఇంధనంపై పన్ను తగ్గించలేదని, ఇప్పుడే తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. కేంద్రం గత నవంబర్లో ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. పన్ను తగ్గించాలని రాష్ట్రాలను అభ్యర్థించింది.
ఇక ఇంతకు ముందు భారతదేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సమయంలో, మోడీ తో లైవ్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమావేశం మధ్యలో ఒకసారి కుర్చీలో వెనక్కి వాలి రెండు చేతులు తల వెనుక పెట్టుకున్నారు. దీంతో ప్రధాని మోడీ ప్రసంగాన్ని పట్టించుకోనట్లు గా, నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిన, మోడీని అగౌరపరిచేలా ప్రవర్తించిన అరవింద్ కేజ్రీవాల్ పై బిజెపి నేతలు మండిపడ్డారు. మేనర్ లెస్ డిల్లీ సీఎం అంటూ విమర్శలు గుప్పించారు.












Click it and Unblock the Notifications