గుజరాత్ అసెంబ్లీ పోరు-బీజేపీ మూడో జాబితా విడుదల-గాంధీనగర్ సౌత్ నుంచి అల్పేష్ ఠాకూర్..
వచ్చే నెల 1, 5 తేదీల్లో రెండు విడతలుగా జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల జాబితాలను కాంగ్రెస్, బీజేపీ, ఆప్ వరుసగా విడుదల చేస్తున్నాయి. ఇదే క్రమంలో అధికార బీజేపీ తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్ధుల మూడో జాబితాను విడుదల చేసింది. ఇందులో పలు కీలక స్ధానాల్లో పోటీ చేసే అభ్యర్దుల్ని ప్రకటించింది.
మొత్తం 182 స్ధానాలున్న గుజరాత్ అసెంబ్లీకి పోటీ చేసే 178 మంది అభ్యర్దుల్ని మూడు జాబితాల్లో బీజేపీ విడుదల చేసింది. ఇందులో మూడో జాబితాలో 12 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది. ఈ జాబితాలో గాంధీనగర్ సౌత్ నుంచి అల్పేష్ ఠాకూర్ ను బరిలోకి దించింది. గతంలో అల్పేష్ ఠాకూర్ ఉపఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఉత్తర గుజరాత్ లోని రాథన్ పూర్ నుంచి కాకుండా గాంధీనగర్ సౌత్ నుంచి ఈసారి బరిలోకి దింపడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2017లో రాధన్ పూర్ నుంచి కాంగ్రెస్ టికెట్ పై గెలిచిన అల్పేష్ ఠాకూర్ ఆ తర్వాత 2019లో ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి ఫిరాయించారు.
సాయాజీ గంజ్ స్ధానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే జితేంద్ర సుఖాడియా స్ధానంలో వడోదర మేయర్ కేయుర్ రోకాడియాను బీజేపీ బరిలోకి దింపింది. ఆరోగ్య కారణాలతో సుఖాడియా తప్పుకోవడంతో రోకాడియాకు టికెట్ దక్కింది. అలాగే వత్వా స్ధానంలో సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రదీప్ సిన్హ్ జడేజాను కాదని, బాబూసింగ్ జాదవ్ కు టికెట్ కేటాయించింది.అలాగే ఈ జాబితాలో మరికొన్ని స్ధానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల స్ధానాల్లో కొన్ని మార్పులు చేశారు.