బీజేపీ ఎమ్మెల్యేల రాజీనామాతో అసెంబ్లీలో 77-75కి పడిపోయిన బలం: మమతా బెనర్జీకి లైన్ క్లియర్?
కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 77 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యేలుగా గెలిచినవారిలో పలువురు ఎంపీలు కూడా ఉన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కీలకంగా వ్యవహరిద్దామని పోటీ చేసి గెలిచినా.. టీఎంసీ అధికారంలోకి రావడంతో ఇక వారు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తున్నారు.
బెంగాల్ అసెంబ్లీలో 77 నుంచి 75కి పడిపోయిన బీజేపీ బలం
ప్రస్తుతం గెలిచిన 77 ఎమ్మెల్యేల్లో ఇద్దరు ఎంపీలు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. దీంతో అసెంబ్లీలో బీజేపీ సభ్యుల సంఖ్య 77 నుంచి 75కు పడిపోయింది. పార్టీ ఆదేశాల మేరకు ఇద్దరు ఎమ్మెల్యేలు నిశిత్ ప్రమాణిక్(కూచ్ బెహర్ ఎంపీ), జగన్నాత్ సర్కార్(రాణాఘాట్ ఎంపీ) తమ రాజీనామాలను అసెంబ్లీ స్పీకర్కు అందజేశారు. లోక్సభలో తమ బలాన్ని కాపాడుకోవడం కోసమే బీజేపీ ఈ మేరకు రాజీనామాలు చేయిస్తోందని టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు.
బెంగాల్ ఫలితాలు ఆశించినట్లు రాలేదన్న బీజేపీ ఎంపీ
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచి అధికారంలోకి వస్తే.. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తారని భావించినా.. అలా జరగకపోవడంతో ఎమ్మెల్యేలుగా గెలిచిన ఎంపీలతో బీజేపీ రాజీనామాలు చేయిస్తోంది. పార్లమెంటులోనే వీరి అవసరం ఎక్కువగా ఉందని బీజేపీ భావిస్తుండటమే ఇందుకు కారణం. బీజేపీ సేఫ్ గేమ్ ఆడుతోందని టీఎంసీ నేతలు విమర్శిస్తున్నారు. బీజేపీ ఎన్నికల ఫలితాలు తాము ఆశించిన విధంగా రాలేదని రాణాఘాట్ బీజేపీ ఎంపీ జగన్నాథ్ సర్కార్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే కీలకంగా వ్యవహరిస్తామని అనుకున్నాం. అయితే, అలా జరగలేదు. దీంతో పార్టీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఎంపీలుగా ఉండాలని ఆదేశించింది. దీంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు శాంతిపూర్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన జగన్నాథ్ సర్కార్ స్పష్టం చేశారు. నిశిత్ ప్రమాణిక్ దిన్హాటా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాగా, ప్రమాణిక్ తోపాటు సర్కార్ కూడా కేంద్ర బలగాలతో భద్రత కలిగివున్నారు.
వరుస దాడులతో బీజేపీ ఎమ్మెల్యేలకు కేంద్ర బలగాలతో సెక్యూరిటీ
పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న నందిగ్రాం బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి జడ్ ప్లస్ సెక్యూరిటీ కలిగివున్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ నేతలపై, వారి నివాసాలపై దాడులు జరిగిన విషయం తెలిసిందే. సుమారు పది మంది వరకు బీజేపీ కార్యకర్తలు హత్యలకు గురయ్యారు. టీఎంసీ గూండాలే ఈ హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని బీజేపీ ఎమ్మెల్యేలకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం. మే 2న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలోని బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరిగాయి. వారి ఇళ్లను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో తమకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి రక్షణ కల్పించదనే విషయం మాకు అర్థమైంది. అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని భద్రత కల్పించాలని కోరినట్లు బీజేపీ అసన్సోల్ సౌత్ ఎమ్మెల్యే అగ్నిమిత్ర మీడియాకు తెలిపారు. ప్రజల ద్వారా ఎన్నికైన ఎమ్మెల్యేలకే రాష్ట్రంలో భద్రత లేకుండా పోయిందని, అందుకే కేంద్ర బలగాల సెక్యూరిటీ అవసరమని భావిస్తున్నట్లు గైఘట బీజేపీ ఎమ్మెల్యే సుబ్రతా ఠాకూర్ తెలిపారు.
ఉపఎన్నికతో మమతా బెనర్జీకి లైన్ క్లియర్?
బీజేపీ ఎమ్మెల్యేలు తాజాగా రాజీనామా చేసిన నియోజకవర్గాలకు త్వరలోనే ఉపఎన్నికలు జరుగనున్నాయి. ఇక నందిగ్రాంలో సువేందు అధికారి చేతిలో ఓటమిపాలైన మమతా బెనర్జీ.. కూడా ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గం భవానీపూర్ నుంచి పోటీ చేస్తారా? లేక బీజేపీ ఎమ్మెల్యేల రాజీనామాతో ఖాళీ అయిన స్థానాల్లో ఏదైనా ఎంచుకుంటారా? అనేది చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన స్థానం నుంచి పోటీ చేసి గెలిస్తే.. టీఎంసీకి మరోస్థానం కూడా కలిసివచ్చే అవకాశం ఉంది.