జుట్టు పట్టి, ఈడ్చేయాల్సింది: మమతపై బిజెపి నేత తీవ్ర వ్యాఖ్యలు
పశ్చిమబెంగాల్ బిజెపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కోల్కతా: పెద్ద నోట్ల రద్దు నాటి నుంచీ తృణమూల్ కాంగ్రెస్, బిజెపి నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా పశ్చిమబెంగాల్ బిజెపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న మమత బెనర్జీని ఢిల్లీ పోలీసులు జుట్టు పట్టి ఈడ్చిపారేసి ఉండాల్సిందని ఆయన వ్యాఖ్యానించారు.
పవ్చిమ మిద్నాపూర్ జిల్లాలో జార్గ్రామ్లో ఆదివారం జరిగిన పార్టీ యువజన విభాగం సమావేశంలో ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. పెద్ద నోట్ల రద్దుతో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి వేల కోట్ల రూపాయలు నష్టపోయారని, అందుకే ఆమెకు మతిభ్రమించిందని దిలీప్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

తాజాగా, ఢిల్లీలో మమత డ్రామా(ఆందోళన) చేస్తున్నప్పుడు జుట్టు పట్టి లాగి విసిరిపారేసి ఉండవచ్చని, అక్కడున్న పోలీసులు తమ వాళ్లేనని.. అయినా తాము అలా చేయలేదంటూ దిలీప్ వ్యాఖ్యానించారు. నోట్ల రద్దుతో పిచ్చి పట్టిన మమత.. ఢిల్లీ, పాట్నా చుట్టూ చక్కర్లు కొడుతోందన్నారు. ఢిల్లీలో, రాష్ట్ర సెక్రటేరియట్ ఆందోళనలు కూడా ఇందులో భాగమేనని అన్నారు.
అంతేగాక, మమత బెనర్జీ.. చివరకు గంగలో దూకుతుందని తాము భావించామని ఆయన అన్నారు. టీఎంసీ తప్పులను పశ్చిమబెంగాల్ ప్రజలు గుర్తిస్తున్నారని, ఇకపై మమత దుశ్చర్యలను తాము క్షమించమని ఘోష్ హెచ్చరించారు.
కాగా, ఘోష్ వ్యాఖ్యలపై టీఎంసీ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని పేర్కొంది. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మమతాపై ఇలాంటి వ్యక్తిగత దూషణలు, బెదిరింపులకు పాల్పడుతోందని మండిపడింది.












Click it and Unblock the Notifications