గేరు మార్చిన దీదీ: దొంగతనం కేసులో సువేందు అధికారిపై ఎఫ్ఐఆర్ -బీజేపీ అస్త్రంతో వారిపైనే ప్రతీకారం
ఎన్నికల ఫలితాలు వెలవడి నెలరోజులు గడిచిన తర్వాత కూడా పశ్చిమ బెంగాల్ లో పోటాపోటీ రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. యాస్ తుపాను సందర్భంలో బెంగాల్ పరిశీలనకు వచ్చిన ప్రధాని మోదీని సీఎం మమతా బెనర్జీ అవమానించడం, ప్రతిగా బెంగాల్ సీఎస్ అలపన్ బందోపాధ్యాయను కేంద్రం రీకాల్ చేయడం, చివరికి అతణ్ని రాజీనామా చేయించి, సలహాదారుగా నియమించుకోవడం తెలిసిందే. ప్రతీకార రాజకీయాలకు పరాకాష్టలాంటి మరో ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈసారి దీదీ ఏకంగా బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారిని టార్గెట్ చేశారు..
HIV మహిళకు Covid: 216 రోజుల్లో వైరస్ 32 సార్లు మ్యూటేషన్ - భారత్లో బీభత్సమే: షాకింగ్ రీసెర్చ్
సువేందుపై దొంగతనం కేసు
పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత, బీజేపీ నాయకుడైన సువేందు అధికారి సహా అతని సోదరుడు సౌమేందు అధికారిపై దొంగతనం కేసు నమోదైంది. సువేందు తండ్రి శిశిర్ అధికారి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తోన్న కంతి పార్లమెంట్ సెట్మెంట్ లోని కంతి మున్సిపాలిటీ కార్యాలయంలో నుంచి లక్షల విలువైన సామాగ్రిని దొంగతనం చేశారనే అభియోగంపై అధికారి సోదరులపై కేసు నమోదైంది. సౌమేందు అధికారి గతంలో కంతి మున్సిపాలిటీ చైర్మన్ గా వ్యవహరించారు.
కొవాగ్జిన్, స్పుత్నిక్ చెల్లవు, అమెరికాలో చదవాలంటే రీవ్యాక్సినేషన్-భారతీయ విద్యార్థుల వర్సిటీల హుకుం
కేంద్ర బలగాల సాయంతో..
''సువేందు, సౌమేందు అధికారిల ఆదేశాల మేరకు వారి అనుచరులు మే29న కంతి మున్సిపాలిటీకి చెందిన గౌడన్ లోకి దౌర్జన్యంగా ప్రవేశించారు. యాస్ తుపాను బాధితుల కోసం పంచాల్సిన రిలీఫ్ సామాగ్రిని వారు ఎత్తుకెళ్లారు. ఆ సామాగ్రి విలువ లక్షల్లోనే ఉంటుంది. బీజేపీ నేతలు ప్రభుత్వ గోడౌన్ లోకి చొరబడిన సమయంలో కేంద్ర సాయుధ బలగాలు సైతం వారికి సహాయపడ్డాయి..'' అంటూ కంతి మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేటివ్ బోర్డ్ సభ్యుడైన రత్నదీప్ మన్నా ఈ నెల 1న చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
బీజేపీని వాళ్ల అస్త్రంతోనే కొట్టింది..
నిజానికి యాస్ తుపాను సహాయ కార్యక్రమాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ బీజేపీ నేతలు టీఎంసీపై పలు చోట్ల ఫిర్యాదులు చేశారు. కేంద్రం ఇచ్చిన రూ.1000కోట్ల సహాయాన్ని, ఇతర సామాగ్రిని సీఎం మమత దారిమళ్లించారంటూ ప్రతిపక్షనేత సువేందు అధికారి అనూహ్య ఆరోపణలు చేశారు. సహాయ సామాగ్రిని టీఎంసీ నేతలు ఎత్తుకెళ్లినట్లు పలు చోట్ల బీజేపీ ఫిర్యాదులు చేయగా, అదే అస్త్రాన్ని బీజేపీపైకే ప్రయోగించిన టీఎంసీ.. ఏకంగా పెద్దతల లాంటి సువేందు అధికారినే బుక్ చేసింది. మరోవైపు, సువేందు అధికారి ముఖ్య అనుచరుడు రేఖాల్ బెరాను కోల్కతా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేశాడని రేఖాల్ పై ఆరోపణ. 2019 జులై, సెప్టెంబర్లో(సువేందు మంత్రిగా ఉన్నప్పుడు) ఈ ఉదంతాలు చోటుచేసుకున్నట్లు కేసు నమోదైంది.