మమతా బెనర్జీ మంత్రాలు తప్పు .. తాను హిందువునన్న దీదీ వ్యాఖ్యలపై బిజెపి అభ్యర్థి సువేందు అధికారి ఫైర్
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల పోరు హోరాహోరీగా కొనసాగుతోంది. తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పశ్చిమబెంగాల్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టడానికి బిజెపి ప్రయత్నాలు చేస్తోంది. ఇక మతం కార్డు రాజకీయాలు నందిగ్రామ్ లో జోరుగా సాగుతున్నాయి . బీజేపీ మతం కార్డుతో మమతా బెనర్జీని టార్గెట్ చేస్తుంటే మమతా బెనర్జీ తాను హిందూ మహిళనని ప్రూవ్ చేసుకునే పనిలో పడింది .
బెంగాల్ పోరు .. తొలి విడత పోల్స్ కు పీఎం మోడీతో సహా బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు వీరే
హిందూ మంత్రాలు చదివి , తాను బ్రాహ్మణ మహిళనని చెప్పుకున్న మమతా బెనర్జీ
ఒకప్పటి తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సువేందు అధికారిని ఓడించాలనే లక్ష్యంతో నందిగ్రామ్ నుంచి మమతా బెనర్జీ ఎన్నికల బరిలోకి దిగారు. నేడు నామినేషన్ కూడా దాఖలు చేశారు. నామినేషన్ పత్రాల దాఖలు అనంతరం జరిగిన బహిరంగ సభ మమతా బెనర్జీ అమ్మ వారి మంత్రపుష్పాన్ని అనర్గళంగా చదివారు . మధ్యలో ఒకటి రెండుసార్లు తడబడినా ఆమె దానిని పూర్తి చేసి మత రాజకీయం చేయాలని చూస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. తాను బ్రాహ్మణ మహిళ అని చెప్పుకున్నారు.
మమత మంత్ర జపం అంతా తప్పు అన్న సువేందు
మమతా బెనర్జీ అమ్మవారి మంత్ర జపం పై బీజేపీ నుంచి బరిలోకి దిగిన ప్రత్యర్థి, ఒకప్పటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత సువేందు అధికారి విమర్శించారు. మమతా బెనర్జీ మంత్ర జపాన్ని తప్పుగా ఉచ్చరించారని పేర్కొన్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి తాను ఒక హిందూ మహిళనని వ్యాఖ్యానించడాన్ని సువేందు అధికారి తప్పుబట్టారు .
మమతా బెనర్జీ దుర్గాదేవికి చండీ మంత్రాలను పఠించి తనకు ఎవరు హిందూ మతం గురించి నేర్పించనవసరం లేదని, లక్ష్మి, సరస్వతి, కాళి మరియు దుర్గా దేవతలకు సంబంధించిన అన్ని మంత్రాలు తనకు తెలుసని మమతా బెనర్జీ చెప్పడంపై మండిపడ్డారు సువేందు అధికారి.
కొన్ని మంత్రాలు నేర్చుకుని , ఎన్నికల మీటింగ్స్ లో చెప్తే హిందూ అవుతారా ?
ఎన్నికలకు ముందు కొన్ని మంత్రాలు నేర్చుకొని , ఎన్నికల సమావేశంలో చెప్పినంత మాత్రాన హిందువుగా మారరంటూ సువేందు అధికారి విమర్శించారు. ఆయన శ్లోకాల రికార్డింగ్ ప్లే చేసి, ఆపై మమతా బెనర్జీ చెప్పిన వెర్షన్ను రీప్లే చేశాడు. ఆమె చండి మంత్రజపం అంతా తప్పని, ఆమె మంత్రాలు తప్పుగా ఉచ్చరించారని పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ఇక ఇన్షా అల్లా, ఖుదా హఫీజ్ వంటి పదాలను వాడడం మానేశారని ఎద్దేవా చేశారు .
చెప్పులేసుకుని ఆలయంలోకి , హిందూ దేవుళ్ళను తిట్టిన వారికి టికెట్ .. హిందువు అంటే ఇదేనా ?
మంగళవారం ఆమె జానకీనాధ ఆలయంలో రాముడి ప్రార్థన చేశారని అది కూడా చెప్పులు వేసుకుని గుళ్ళోకి వెళ్లారని విమర్శించారు సువేందు అధికారి. హిందూ దేవతలను తిట్టిన సయాని ఘోష్ కు మమతా బెనర్జీ టికెట్ ఇచ్చారని, అలాంటి మమతా బెనర్జీకి తాను హిందువునని ఇప్పుడే గుర్తుకొచ్చిందా అంటూ ప్రశ్నించారు. మమతా బెనర్జీ హిందూ ధర్మాన్ని జపించటాన్ని సువేందు అధికారి తీవ్రంగా తప్పు పట్టారు. పశ్చిమ బెంగాల్ లో జరగనున్న ఎన్నికల్లో తృణమూల్ పార్టీ బూత్ ల లోకి చొరబడి రిగ్గింగ్ చేసే అవకాశముందని తను ఉన్నంత వరకు అది జరగనివ్వనని సువేందు అధికారి పేర్కొన్నారు.