వారణాసిలో మోడీ రిజెక్ట్ : అయోధ్య, మధురాల్లో బీజేపీ ఓటమి-పతనం ప్రారంభమైందా..?
లక్నో: భారతీయ జనతా పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పెద్ద రాష్ట్రాల్లో ఒక్క అస్సాంలోనే విజయం సాధించిన కాషాయం పార్టీ... బెంగాల్లో ఘోరంగా దెబ్బతినింది. మూడంకెల సీట్లు సాధిస్తామన్న ధీమాతో ఉన్న బీజేపీ రెండంకెలకే పరిమితమైంది. ఇక కేరళలో, తమిళనాడులో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. వచ్చే ఏడాది మరో పెద్ద రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజీపీకి పలు జిల్లాల్లో చేదు అనుభవం ఎదురైంది. పంచాయతీ ఎన్నికల్లో కమలం పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది.
వారణాసిలో మోడీని తిరస్కరించిన ఓటర్లు
ఉత్తర్ ప్రదేశ్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాషాయం పార్టీకి కంచుకోటగా ఉన్న అయోధ్య, వారణాసి, లక్నో జిల్లాలో ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ సమాజ్వాదీ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వారణాసి నుంచి ప్రధాని మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అక్కడ కూడా బీజేపీ చతికిలపడింది. 40 సీట్లలో కేవలం 8 స్థానాల్లో మాత్రమే బీజేపీ విజయం సాధించింది. మరోవైపు సమాజ్వాదీ పార్టీ 14 సీట్లు, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ ఐదు సీట్లు, అప్నాదల్ (ఎస్) మూడు సీట్లు, ఆమ్ ఆద్మీ పార్టీ , సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీలు ఒక్కో సీటు సొంతం చేసుకున్నాయి. మరోవైపు ముగ్గురు ఇండిపెండెంట్లు కూడా గెలుపొందారు.
పుంజుకున్న సమాజ్వాదీ పార్టీ
లక్నో విషయానికొస్తే.. బీజేపీ ఇక్కడ మరింత ఘోరంగా విఫలమైంది. 25 సీట్లలో కేవలం మూడు సీట్లు మాత్రమే బీజేపీ గెలుచుకుంది. బీజేపీ నేత మాజీ ఎంపీ రీనా చౌదరి 18వ వార్డు నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఎస్పీ మద్దతు ఇచ్చిన వ్యక్తి పాలక్ రావత్ 2వేల ఓట్ల మెజార్టీతో రీనాపై విజయం సాధించారు. అయోధ్యలో కూడా బీజేపీ ఖంగు తినింది. అయోధ్యలో రామమందిరం బీజేపీ నిర్మిస్తున్న విషయంను కూడా పక్కనబెట్టి అక్కడి ఓటర్లు ఈ పార్టీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. మొత్తం 40 సీట్లున్న అయోధ్యలో బీజేపీ కేవలం 6 సీట్లకే పరిమితం కాగా... సమాజ్వాదీ పార్టీ 24 సీట్లలో విజయం సాధించింది. మరో ఐదు స్థానాల్లో బీఎస్పీ గెలుపొందింది. ఈ మధ్యనే బీజేపీలో చేరిన ములాయం సింగ్ యాదవ్ బంధువు సంధ్య యాదవ్ ఘిరోర్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఘిరోర్ స్థానం సమాజ్వాదీపార్టీకి కంచుకోటగా ఉంది.
Recommended Video
గోరక్పూర్లో హోరా - హోరీ
ఇక పలువురు బీజేపీ నాయకులు ప్రస్తుతం పలు పదవుల్లో ఉన్న నేతల కుటుంబ సభ్యులు, బంధువులు సైతం పంచాయతీ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. వచ్చే ఏడాది ఉత్తర్ ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఈ మార్పు నాంది అని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక సీఎం యోగీ ఆదిత్యనాథ్ సొంత గడ్డ గోరఖ్పూర్ జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ మే 2వ తేదీ నుంచి కొనసాగుతోంది. అయితే ఫలితాలపై అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇప్పటి వరకు 68 వార్డులకు సంబంధించిన ఫలితాలు వెలువడగా బీజేపీ - సమాజ్వాదీ పార్టీల మధ్య పోరు హోరాహోరీగా ముగిసింది. 20 వార్డుల్లో బీజేపీ గెలువగా 19 వార్డుల్లో ఎస్పీ విజయం సాధించింది.
మొత్తానికి పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంటే కరోనావైరస్ ఉత్తర్ ప్రదేశ్లో ఉధృతంగా ఉండటం, ఆక్సిజన్ కొరత తలెత్తడం, ప్రభుత్వ వైఫల్యంగా భావించి అక్కడి ఓటర్లు తీర్పు ఇచ్చి ఉంటారనేది స్పష్టంగా తెలుస్తోందని పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు.