తెలంగాణలో బిజెపి వ్యూహం: అందుకే కెసిఆర్ తనయ ఆ వ్యాఖ్యలు?
న్యూఢిల్లీ: అకస్మాత్తుగా తెలంగాణ ముఖ్యమంత్రి తనయ, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత ప్రధాని మోడీ ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నారనేది అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రతిపాదన వస్తే కేంద్ర ప్రభుత్వంలో చేరే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పిన కవిత ఆ తర్వాత మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. అయితే, బిజెపి వ్యూహాన్ని పసిగట్టి, తమతో కలిసి పనిచేయడానికి బిజెపి సిద్ధంగా లేదని అర్థం కావడంతో ఆమె ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారనేది బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మరుళీధర్ రావు తాజాగా చేసిన వ్యాఖ్యలను గమనిస్తే అర్థమవుతోంది. టీఆర్ఎస్తో తమ పార్టీ చేతులు కలిపే అవకాశాలు లేవని ఆయన స్పష్టంగా చెప్పారు. తెలంగాణలో సొంతంగా ఎదగాలనేది తమ వ్యూహమని కూడా ఆయన చెప్పారు.
ప్రధాని మోడీ ఏడాది పాలన.. మాటలు ఎక్కువ, పని తక్కువ అన్నట్లుగా ఉందని కవిత కేంద్ర మంత్రి బీరేంద్రను కలిసిన తర్వాత మీడియా ప్రతినిధుల వద్ద వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో అనుకున్న పనులు జరగడం లేదన్నారు. విభజన చట్టం అమలుపై వేగం లేదన్నారు. మోడీతో సెల్ఫీ దిగి కితాబిచ్చిన తర్వాత ఆమె ఆ వ్యాఖ్యలు చేయడం వెనక చాలా కథనే నడిచిందని అనిపిస్తోంది. మురళీధర్ రావు మాటలు ఆ కథకు సంబంధించిన గుట్టును విప్పినట్లే కనిపిస్తోంది.
2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలతో పాటు తెలంగాణలో జరిగే అన్ని ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి విజయం సాధించాలని బిజెపి పట్టుదలతో ఉందని, అందువల్ల టిఆర్ఎస్తో కలసి పనిచేసే అవకాశాలు ఉండవని ఆయన చెప్పారు. బిజెపి నాయకత్వం ఆహ్వానిస్తే కేంద్ర మంత్రి వర్గంలో చేరే అంశాన్ని పరిశీలిస్తామంటూ కొంత మంది టిఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రకటనల్లో అర్ధం లేదని మురళీధరరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి నడుస్తున్న బిజెపి ఆ వ్యూహాన్నే అనుసరించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో తెలుగు దేశం పార్టీ మేజర్ భాగస్వామి కాగా, తెలంగాణలో తాము తెలుగుదేశం పార్టీకి ప్రధాన భాగస్వామిగా మారాలనే వ్యూహరచనతో బిజెపి నాయకత్వం పనిచేస్తున్నట్లు అనిపిస్తోంది. టిడిపి తెలంగాణలో క్షీణిస్తుండడం, తమ పార్టీకి తెలంగాణలో తగిన కార్యకర్తల బలగం ఉండడం, టిడిపి కార్యకర్తలతో బలంతో తమ బలగం కలిస్తే ప్రధానమైన శక్తిగా మారే అవకాశాలు ఉండడం అనేవి బిజెపి టీఆర్ఎస్ను దూరంగా ఉంచాలనే నిర్ణయానికి కారణమని తెలుస్తోంది.
అంతేకాకుండా కెసిఆర్ రాజకీయాలను తనకు అనుకూలంగా మలుచుకోవడంలో దిట్ట. ఆయన వ్యూహాలు మారుతూ ఉంటాయి. కాంగ్రెసు విషయంలో కెసిఆర్ చేసిన పని అదే. ఎన్నికల్లో కాంగ్రెసుతో కలిసి నడుస్తానని చెప్పిన కెసిఆర్ ఆ తర్వాత తాను ఒంటరిగా వెళ్తానని చెప్పి కాంగ్రెసును దూరం పెట్టారు. ఇది కూడా బిజెపి జాతీయ నాయకులను ఆలోచనలో పడేసినట్లు చెబుతున్నారు. దానికితోడు, తొలినాళ్లలో కెసిఆర్ కేంద్రప్రభుత్వాన్ని ఢీకొట్టే విధంగా వ్యవహరించిన తీరు కూడా వారి మనస్సుల్లో ఉన్నట్లు అర్థమవుతోంది.
తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టిన కెసిఆర్ తొలి ఆరు నెలల్లో కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరిని అనుసరించారని, అయితే గత ఆరు నెలల్లో ఆయన వ్యవహార శైలి మారిందని, ఇప్పుడు కేంద్రంలో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకునేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని మురళీధర్రావు అన్నారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి దగ్గర కావాలని కెసిఆర్ ప్రయత్నాలు చేస్తుండడాన్ని కూడా బిజెపి జాతీయ నాయకులు నిశితంగానే పరిశీలిస్తున్నారని, అయితే కెసిఆర్ను దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నారని మురళీధర్ రావు మాటలను బట్టి అర్థమవుతోంది. పైగా, టిఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే తాము బిజెపితో తెగదెంపులు చేసుకుంటామని తెలంగాణ టిడిపి నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
చంద్రబాబుకు తెలియకుండా ఎర్రబెల్లి దయాకర రావు ఆ వ్యాఖ్యలు చేశారని అనుకోలేం. ఎర్రబెల్లి వ్యాఖ్యలను బిజెపి పరిగణనలోకి తీసుకున్నట్లు కూడా చెబుతున్నారు. కెసిఆర్తో చేతులు కలపడం కన్నా చంద్రబాబుతో కలిసి నడవడం వల్లనే తమకు భవిష్యత్తు ఉంటుందని బిజెపి నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.