మమత బయోపిక్కు తప్పని తిప్పలు! విడుదల ఆపాలంటూ ఈసీకి బీజేపీ ఫిర్యాదు!
కోల్కతా : దేశంలో ప్రస్తుతం రాజకీయ నేతల బయోపిక్ల ట్రెండ్ నడుస్తోంది. అయితే ఎన్నికల సమయం కావడంతో నేతల జీవిత గాధల ఆధారంగా తెరకెక్కిన చిత్రాలపై రచ్చ జరుగుతోంది. ప్రధాని నరేంద్రమోడీ బయోపిక్ విడుదలపై ఇప్పటికే నానా రభస జరుగుతుండగా.. తాజాగా ఆ లిస్టులో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బయోపిక్ చేరింది.
ఓటు వేసిన సూపర్ స్టార్స్: పోలింగ్ కేంద్రం వద్ద కుమార్తెతో కలిసి వరుసలో నిల్చుని..!
బాఘిని : బెంగాల్ టైగ్రస్
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం బాఘిని బెంగాల్ టైగ్రస్. ఈ సినిమా విడుదలకు సెన్సార్ బోర్డ్ క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో మే 3వ తేదీని సినిమా రిలీజే చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన రుమా చక్రవర్తి రాజకీయ నేత ఇందిరా బందోపాధ్యాయ్గా నటించారు. సినిమాలో ఇందిరను ఆమె మద్దతుదారులు దీదీ అని పిలుస్తుంటారు. అయితే సినిమా ట్రైలర్లో ఆ పాత్ర మమతా బెనర్జీని పోలి ఉండటం, సింగూరు, నందిగ్రామ్ ఘటనలను ప్రస్తావించడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈసీకి బీజేపీ ఫిర్యాదు
ఇదిలా ఉంటే బాఘిని సినిమా విడుదలను నిలిపివేయాలంటూ బీజేపీ ఎలక్షన్ కమిషన్కు లేఖ రాసింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జీవితగాధ ఇతివృత్తంగా రూపొందించిన ఈ చిత్రాన్ని రిలీజ్ చేయొద్దని కోరింది. ప్రధాని బయోపిక్ను సమీక్షించినట్లే మమతా బయోపిక్ను పరిశీలించాలని, సీఈసీ, బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కు బీజేపీ విన్నవించింది.
మమత బయోపిక్ కాదంటున్న నిర్మాత
బాఘిని, బెంగాల్ టైగ్రస్ నినిమా బయోపిక్ కాదని దర్శక నిర్మాతలు అంటున్నారు. మమతా బెనర్జీ జీవితం నుంచి స్పూర్తి పొంది రాసుకున్న కథ మాత్రమే అని చెబుతున్నారు. మహిళా సాధికారితకు సంబంధించిన సినిమా అయినందునే దాని విడుదలను అడ్డుకోవద్దని కోరుతున్నారు.