బ్లాక్ ఫ్రైడే: మార్కెట్పై కోలుకోలేని దెబ్బ: అన్నీనష్టాల్లో: ఆల్టైమ్ గరిష్ఠానికి క్రూడ్ రేట్
ముంబై: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతోన్న భీకర యుద్ధం.. తొమ్మిదో రోజుకు చేరుకుంది. రష్యన్ సైనిక బలగాలు తమ దాడులు విస్తృతం చేశాయి. దాదాపు అన్ని నగరాలపైనా విరుచుకుని పడుతున్నాయి. రాజధాని కీవ్ను స్వాధీనం చేసుకునే విషయంలో ఉక్రెయిన్ సైన్యం నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటోన్నప్పటకీ- మిగిలిన నగరాల్లో అలాంటి పరిస్థితి దాదాపుగా కనిపించట్లేదు. ప్రత్యేకించి తూర్పు ప్రాంతంలోని పలు నగరాలపై రష్యన్ ఆర్మీ దాడులు దూకుడును కొనసాగిస్తోంది. రాకెట్ల మోత మోగిస్తోంది.
స్టాక్ మార్కెట్పైనా
స్టాక్ మార్కెట్పై రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం కొనసాగుతోంది. ఇవ్వాళ కూడా మార్కెట్ కుప్పకూలిపోయింది. లక్షల కోట్ల రూపాయల మేర షేర్లు నష్ట పోయాయి. దాదాపు అన్ని సెగ్మెంట్స్కు సంబంధించిన స్టాక్స్ అన్నీ నెగెటివ్లో ట్రేడింగ్ అయ్యాయి. అమ్మకాల ఒత్తిడి మార్కెట్ను దడదడలాడించింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర కూడా ఆల్టైమ్ గరిష్ఠానికి చేరింది. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనంత క్రూడాయిల్ ధర భారీగా పెరిగింది. ఈ యుద్ధం ముగిసేంత వరకూ ఇదే రకమైన ట్రెండ్ కనిపించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
1,000 పాయింట్లకు పైగా నష్టంతో..
సెన్సెక్స్.. ఇవ్వాళ ఆరంభం నుంచే రెడ్ జోన్లో ట్రేడింగ్ అవుతూ వచ్చింది. 755 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ఆరంభమైంది. ఆ తరువాత దీని గ్రాఫ్ నేల చూపులు చూసింది. సమయం గడుస్తోన్న కొద్దీ షేర్లన్నీ మైనస్లోకి వెళ్లిపోవడం కనిపించింది. తొలి గంట ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,050.65 పాయింట్ల మేర నష్టాన్ని చవి చూసింది. ఆ తరువాత కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఏ దశలో కూడా అప్పర్ సర్కుట్కు చేరుకోలేకపోయింది. తొలి గంట ముగిసే సమయానికి 54,052.03 పాయింట్ల వద్ద సెన్సెక్స్ ట్రేడింగ్ నమోదైంది.
నిఫ్టీదీ అదే దారి..
నిఫ్టీ కూడా ఇదే పతనాన్ని చవి చూసింది. తొలి గంటలో 304.40 పాయింట్లను నష్టపోయింది. 16,193.65 పాయింట్ల వద్ద నిఫ్టీ తొలి గంటలో ట్రేడింగ్ నమోదు చేసుకుంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందనడంలో సందేహాలు అక్కర్లేదని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు తమ షేర్లను భారీగా అమ్ముకోవడం వల్ల నెగెటివ్ ట్రెండింగ్ నెలకొందని పేర్కొన్నాయి.
సెక్టోరియల్ సెగ్మెంట్స్ అన్నీ నష్టాల్లోనే..
స్టాక్ మార్కెట్లో సెక్టోరియల్ సెగ్మెంట్స్ అన్నీ నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెటల్, రియల్ ఎస్టేట్స్ సెగ్మెంట్స్కు సంబంధించిన షేర్ల ధరలన్నీ దారుణంగా పడిపోయాయి. ఐటీ, ఆటో, మెటల్, పవర్, ఫార్మాసూటికల్స్, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్.. ఇలా అన్ని సెగ్మెంట్స్ 2 నుంచి 4 శాతం మేర నష్టపోయాయి. ఇన్వెస్టర్ల సంపద లక్షల కోట్ల రూపాయల మేర ఆవిరయింది.
15 శాతం నష్టపోయిన ఆసియన్ పెయింట్స్..
తొలి గంటలో ఆసియన్ పెయింట్స్ షేర్ల ధరలు భారీగా నష్టపోయాయి. 15 శాతం మేర వాటి ధరలు పడిపోయాయి. వొడాఫోన్ ఐడియా షేర్లల్లో మూడుశాతం మేర క్షీణత కనిపించింది. ఎల్ అండ్ టీ, పవర్ గ్రిడ్, ఐటీసీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, నెస్ట్లె ఇండియా, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందుస్తాన్ యూనిలివర్, మారుతి, యాక్సిస్ బ్యాంక్.. ఇలా అన్ని సెగ్మెంట్స్ నష్టపోయాయి. టాటాస్టీల్, ఎన్టీపీసీ మాత్రమే కొంత మేర అప్పర్ సర్క్యుట్లో ట్రేడ్ అయ్యాయి.
ఆల్టైమ్ గరిష్ఠానికి క్రూడ్ రేట్
మరోవంక- క్రూడాయిల్ ధర కూడా ఆల్టైమ్ గరిష్ఠానికి చేరింది. బ్యారెల్ ఒక్కింటికి 120 డాలర్లను టచ్ చేసింది. దశాబ్దకాలం తరువాత ఈ స్థాయిలో ముడిచమురు రేటు పెరగడం ఇదే తొలిసారి. బ్రెంట్లో 2012లో బ్యారెల్ క్రూడాయిల్ ఒక్కింటికి 119 డాలర్లను తాకింది. ఆ తరువాత మళ్లీ ఈ స్థాయిలో వాటి రేటు పలకింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆరంభమైనప్పటి నుంచీ క్రూడాయిల్ బ్యారెల్ రేటు పెరుగుతూ వస్తోంది. ఇప్పుడది గరిష్ఠానికి చేరింది. దీని ప్రభావంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగే అవకాశాలు లేకపోలేదు.