బొగ్గు కొరతతో విద్యుత్ సంక్షోభం రాబోతోందా?: భయాలొద్దంటూ కేంద్రమంత్రి క్లారిటీ
న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు కొరత ఏర్పడిందని వస్తున్న వార్తలపై కేంద్రం స్పందించింది.
దేశంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత ఏర్పడిందని, దీంతో విద్యుత్ సంక్షోభం ఎదుర్కోబోతున్నట్లు వస్తోన్న వార్తలను కేంద్ర విద్యుత్శాఖ మంత్రి ఆర్కే సింగ్ కొట్టిపారేశారు విద్యుత్ సంక్షోభంపై అనవసర భయాందోళనలు సృష్టించబడ్డాయని తెలిపారు. కేవలం గెయిల్ (జీఏఐఎల్), డిస్కం సంస్థల మధ్య సమాచార లోపం వల్లే ఇలాంటివి ఏర్పడినట్లు పేర్కొన్నారు.
రాజధాని ఢిల్లీ, మరికొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరాకు ప్రమాదం ఏర్పడనున్నట్లు ఆందోళనలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో కేంద్ర విద్యుత్శాఖ మంత్రి ఆర్కే సింగ్ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఎన్టీపీపీ, బీఎస్ఈఎస్లతో పాటు విద్యుత్ మంత్రిత్వశాఖ అధికారులతో ఆయన నివాసంలో సమావేశమైన అనంతరం ఆర్కే సింగ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందంటూ వినియోగదారులకు సమాచారాన్ని పంపడం పట్ల కొన్ని సంస్థలను హెచ్చరించినట్లు కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వ సంస్థ గెయిల్ కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం పట్ల వారిని కూడా మందలించినట్లు సమాచారం.
విద్యుత్ సంక్షోభం ఎదుర్కోబోతున్నట్లు అనవసర భయాందోళనలు సృష్టించారు. దేశంలో నాలుగు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి. మరోవైపు ఎట్టిపరిస్థితుల్లోనూ గ్యాస్ సరఫరా కూడా తగ్గదు. విద్యుత్ అవసరమైన వారు కోరితే వారికి సరఫరా చేస్తామని కేంద్ర విద్యుత్శాఖ మంత్రి ఆర్కే సింగ్ స్పష్టం చేశారు. దేశంలో విద్యుత్ సంక్షోభానికి కారణమయ్యే సరఫరా, వినియోగం మధ్య ఎలాంటి అగాధం లేదని పేర్కొన్నారు. విద్యుత్ కేంద్రాలకు అవసరమైన గ్యాస్ అందించాలని ఇప్పటికే గెయిల్ (జీఏఐఎల్) సీఎండీకి ఆదేశించినట్లు కేంద్రమంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. ప్రజల్లో అనవసర భయాలు సృష్టించోద్దని, విద్యుత్ సంక్షోభం ఎలాంటిది రాబోదని స్పష్టం చేశారు.

దేశ రాజధాని ఢిల్లీ, పంజాబ్లలోని థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో బొగ్గు నిల్వలు దాదాపుగా కనిష్ఠ స్థాయికి చేరాయని వార్తలు వచ్చాయి. గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా విద్యుత్తు ఉత్పత్తి ప్రభావితం అయినట్లు సమాచారం. మొత్తంగా దేశంలోని 135 థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో సగానికిపైగా కేంద్రాల వద్ద బొగ్గు నిల్వలు మూడు రోజుల అవసరాల కంటే తక్కువగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో కేంద్రం చాలినంతగా బొగ్గు సరఫరా చేయట్లేదంటూ పంజాబ్ సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న కొద్దిపాటి బొగ్గు నిల్వలూ వేగంగా అడుగంటుతున్నాయని, రానున్న రోజుల్లో థర్మల్ విద్యుత్తు కేంద్రాలు మూతపడటం ఖాయమని వ్యాఖ్యానించారు.
Recommended Video
ఇక ఢిల్లీలో బొగ్గు నిల్వలపై సీఎం కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజధానిలో విద్యుత్తు సంక్షోభం తలెత్తకుండా వెంటనే బొగ్గు, గ్యాస్ సరఫరా చేయాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు. కేంద్ర బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. మూడు నాలుగు రోజుల్లో పరిస్థితులు అదుపులోకి వస్తాయని చెప్పారు. కేంద్రం కరోనా సమయంలో కూడా ఆక్సిజన్ అందుబాటులో ఉందని, ఆ తర్వాత పరిస్థితులు తీవ్రంగా మారాయని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.












Click it and Unblock the Notifications