రక్తం గడ్డ కట్టే రిస్క్... భారత్లో ఎన్ని కేసుల్లో బయటపడిందంటే... వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై కీలక రిపోర్ట్...
భారత్లో వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ కేంద్రానికి సమర్పించిన నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా కోవీషీల్డ్,కోవాగ్జిన్ వ్యాక్సినేషన్ ప్రక్రియ నేపథ్యంలో... 23వేల మందిపై వ్యాక్సిన్ దుష్ప్రభావాన్ని గుర్తించారు. ఇందులో 700 సీరియస్ కేసులను గుర్తించగా.. 498 కేసులపై లోతైన విశ్లేషణ జరిపారు. 26 కేసుల్లో స్వల్ప రక్తస్రావం,రక్తం గడ్డకట్టిన లక్షణాలను గుర్తించారు. కోవీషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలోనే ఈ దుష్ప్రభావాలు బయటపడటం గమనార్హం. కోవాగ్జిన్కు సంబంధించి ఇలాంటి దుష్ప్రభావాలేవీ గుర్తించలేదు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలు వెల్లడించింది.
ఆ దేశాలతో పోల్చితే చాలా తక్కువ రిస్క్..
భారత్లో వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై ఏఈఎఫ్ఐ(The National Adverse Event Following Immunisation committee) కమిటీ అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా కోవీషీల్డ్,కోవాగ్జిన్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై అధ్యయనం జరిపి కేంద్రానికి నివేదిక అందించింది. ఈ నివేదిక ప్రకారం దేశంలో 1 మిలియన్ డోసుల వ్యాక్సిన్కు 0.61 శాతం కేసుల్లో తీవ్ర దుష్ప్రభావాలు బయటపడ్డాయి. అంటే ఒక మిలియన్కు నాలుగు కేసులు అనుకోవచ్చు. అదే యూకెలో ఒక మిలియన్కు 40,జర్మనీలో 100 కేసులు బయటపడ్డాయి.
కేవలం 26 కేసుల్లో మాత్రమే...
యూకెలో ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్(కోవీషీల్డ్) వ్యాక్సిన్ తీసుకున్నవారిలో రక్తం గడ్డ కట్టడం వంటి లక్షణాలు బయటపడిన సంగతి తెలిసిందే. కొందరిలో ఇది మరణానికి కూడా దారితీసింది. ఈ నేపథ్యంలో భారత్లోనూ వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై అధ్యయనం చేసేందుకు ఏఈఎఫ్ఐ నేత్రుత్వంలో కమిటీ ఏర్పడింది. దేశంలో ఇప్పటివరకూ వేసిన 7.5కోట్ల వ్యాక్సిన్ డోసులపై ఈ కమిటీ అధ్యయనం చేసింది. ఇందులో 23వేల కేసుల్లో దుష్ప్రభావాలను గుర్తించగా.. కేవలం 700 కేసుల్లో మాత్రమే తీవ్ర లక్షణాలను గుర్తించారు. ఇందులో 26 కేసుల్లో రక్తస్రావం,రక్తం గడ్డం కట్టడం వంటి ప్రమాదకర లక్షణాలు గుర్తించారు.
యూరోప్తో పోలిస్తే 70శాతం తక్కువ...
యూరోపియన్ సంతతికి చెందిన వారితో పోల్చితే దక్షిణ మరియు ఆగ్నేయాసియా సంతతికి చెందినవారిలో వ్యాక్సిన్ తర్వాత రక్తం గడ్డం కట్టే ప్రమాదం దాదాపు 70 శాతం తక్కువగా ఉందని నివేదికలో వెల్లడించారు. వ్యాక్సిన్ దుష్ప్రభావాలకు సంబంధించి తాజా నివేదిక నేపథ్యంలో కేంద్రం ప్రత్యేక సూచనలు జారీ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా కోవీషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న 20 రోజుల్లో దుష్ప్రభావాలు కనిపిస్తే వ్యాక్సినేషన్ కేంద్రంలో రిపోర్ట్ చేసేలా చర్యలు తీసుకోనుంది. కోవీషీల్డ్లో స్వల్ప దుష్ప్రభావాలు కనిపిస్తున్నప్పటికీ భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా కరోనాను ఎదుర్కోవడంలో ఈ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచే దిశగా..
ప్రస్తుతం భారత్లో కోవీషీల్డ్,కోవాగ్జిన్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎమర్జెన్సీ కేసుల్లో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ వినియోగానికి కూడా కేంద్రం ఇటీవలే అనుమతినిచ్చింది. ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్ అభివృద్ది చేసిన కోవీషీల్డ్ వ్యాక్సిన్ భారత్లోని సీరమ్ ఇన్స్టిట్యూట్లో ఉత్పత్తి అవుతోంది. కోవాగ్జిన్ భారత్ బయోటెక్ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. అయితే కేవలం ఈ రెండు సంస్థలే వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో తీవ్రమైన కొరత నెలకొంది. దీంతో భవిష్యత్తులో కోవాగ్జిన్ పేటెంట్ను రద్దు చేసి ఇతర వ్యాక్సిన్ మాన్యుఫాక్చరర్స్కు కూడా దాని ఫార్ములాను అందించే అవకాశం ఉంది. తద్వారా వ్యాక్సిన్ ఉత్పత్తి పెరుగుతుంది.