తండ్రి చెప్పాడని గొడుగు కోసం వెళ్లింది.. ఆపై డ్రైనేజీలో శవమై తేలింది!
చంఢీఘడ్: హర్యానా యమునా నగర్ జిల్లాలోని ఓ డ్రైనేజీలో ఐదేళ్ల బాలిక మృతదేహాన్ని పోలీసులు ఆదివారం గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తి ఆమె గొంతు కోసి హత్య చేసినట్టు తెలిపారు. బాలికపై అత్యాచారం జరిగిందా? అన్న విషయాన్ని వారు ధ్రువీకరించలేదు.
పోలీసుల కథనం ప్రకారం.. శనివారం రోజు బాలికను తీసుకుని ఆమె తండ్రి సమీపంలోని నది వద్దకు చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఆ సమయంలో ఎండ బాగా ఉండటంతో ఇంటికెళ్లి గొడుగు తీసుకురమ్మని బాలికతో చెప్పాడు. దీంతో ఇంటికెళ్లిన బాలిక గొడుగు తీసుకుని తండ్రి వద్దకు బయలుదేరింది. అయితే ఆమె అక్కడికి చేరుకోలేదు.
బాలిక రాకపోవడంతో కంగారుగా ఇంటికి చేరుకున్న తండ్రికి అక్కడ ఆమె కనిపించలేదు. దీంతో స్థానికులతో కలిసి చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించాడు. ఎక్కడా బాలిక ఆచూకీ తెలియకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశాడు.
బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులకు.. ఓ డ్రైనేజీలో బాలిక మృతదేహం లభించింది. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు.