పక్కపక్కనే కిరణ్, బొత్స: 'ప్రపంచంలోనే అది జగన్ వద్ద'
న్యూఢిల్లీ: రాష్ట్ర సమైక్యత కోసం దేశ రాజధాని న్యూఢిల్లీలోని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేపట్టిన మౌన దీక్షలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. కిరణ్, బొత్సలు పక్కపక్కనే కూర్చున్నారు. కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావు కూడా సిఎంతో పాటు మౌన దీక్షకు దిగారు. కాగా, దీక్షా ప్రాంగణం సమైక్య నినాదాలతో దద్దరిల్లుతోంది.
జగన్ పైన మండిపడ్డ ఆనం
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాసన సభ్యులు ఆనం వివేకానంద రెడ్డి నిప్పులు చెరిగారు. జగన్ సమైక్యవాద ముసుగులో ఉన్న వేర్పాటు వాది అన్నారు. తాను కాబోయే ముఖ్యమంత్రిని అని జగన్ చెబుతుంటే నమ్మేందుకు ప్రజలు అమాయకులు కాదన్నారు. అధిష్టానం పైన తిరుగుబాటు చేసిన కిరణ్ అసలైన సమైక్యవాది అన్నారు. జగన్ గురించి తాను రేపు మాట్లాడుతానని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడైనా భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందని, ఒక్క జగన్ వద్ద మాత్రమే ఏకత్వంలో భిన్నత్వం ఉంటుందని ఎద్దేవా చేశారు.

పార్లమెంటులో ఎలా పెడతారు?: ఏరాసు
అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో ఎలా పెడతారని మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్వయంగా ధర్నాలో కూర్చున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవాలన్నారు. కేంద్రానికి ఏ భాషలో చెబితే అర్థమవుతుందన్నారు. కిరణ్ దీక్ష చేస్తోంది సీమాంధ్ర ప్రజల కోసం కాదని, తెలుగు ప్రజల కోసమని కాసు వెంకట కృష్ణా రెడ్డి అన్నారు. కిరణ్ వెంట తామంతా ఉంటామని, సమైక్యాన్ని కాపాడుకుంటామని చెప్పారు. కేంద్రం తొందరపాటు నిర్ణయం దేశానికి ప్రమాదమన్నారు. కేంద్రం నిర్ణయం వెనక్కి తీసుకోవాలని గల్లా అరుణ కుమారి డిమాండ్ చేశారు.
తెలంగాణ బిల్లు పార్లమెంటుకు రాకుంటా అడ్డుకుంటామని హర్ష కుమార్ అన్నారు. కేంద్రం ఒంటెత్తు పోకడలతో సామాన్యులకు రాజ్యాంగంపై నమ్మకం పోతోందని మండిపడ్డారు. తొమ్మిది వేలకు పైగా సవరణలు వస్తే మంత్రుల బృందం (జివోఎం) వాటిని పరిశీలించలేదన్నారు.
ముఖ్యమంత్రే రోడ్డెక్కారంటే..: గంటా
సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రోడ్డెక్కాల్సిన పరిస్థితి తలెత్తిందంటే మెజారిటీ ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. విభజన ఎవరికీ మంచిది కాదని ముఖ్యమంత్రి లెక్కలతో సహా వివరించారని అన్నారు. విభజనకు ప్రాతిపదిక లేనప్పుడు విభజించాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. మనోభావాలు అనే వాదన మొదలైతే ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక వాదాలు మొదలవుతాయన్నారు. ఇప్పటికైనా అధిష్ఠానం వాస్తవాలు గ్రహించాలని సూచించారు.












Click it and Unblock the Notifications