షాకింగ్: ఉగ్రవాద సంస్థలో చేరిన ఐపీఎస్ అధికారి సోదరుడు
ఈశాన్య భారతంలో ఐపీఎస్ అధికారి సోదరుడు ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్లో చేరడం కలకలం రేపుతోంది. కశ్మీర్ యూనివర్శిటీలో చదువుతున్న షమ్సుల్ హక్ గత మే 22న అదృశ్యమయ్యాడు. తన కొడుకు కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు కూడా చేశారు. ఇక అప్పటి నుంచి షమ్సుల్ హక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే షమ్సుల్ హక్ తుపాకీ పట్టుకున్న ఫోటోను హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థ సోషల్ మీడియాలో విడుదల చేసింది. దీంతో జమ్ముకశ్మీర్లో ఫోటో వైరల్ అవడంతో అసల విషయం వెలుగుచూసింది.
ఆదివారం రోజున హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థ షమ్సుల్ ఫోటోతో పాటు కొత్తగా నియమించుకున్న పలువురి ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఎన్కౌంటర్లో మృతి చెందిన బుర్హాన్ వాణీ వర్ధంతి రోజునే ఈ ఫోటోలు విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. షమ్సుల్ హక్ షోపియన్ జిల్లాలోని ద్రగడ్ గ్రామానికి చెందినవాడు. బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడిసిన్ చదువుతూ మధ్యలోనే మానేశఆడు. జకురాలోని కాలేజ్ క్యాంపస్లో ఈఏడాది మే 22న అదృశ్యమైన షమ్సుల్... మే 25న హిజ్బుల్ ముజాహిద్దీన్లో చేరాడు. ఇదిలా ఉంటే... శమ్సుల్ సోదరుడు ఇనాముల్ హక్ 2012 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. ఈయన ఈశాన్య రాష్ట్రాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.
ఉగ్రవాద సంస్థ ఫోటోలను విడుదల చేస్తూ షమ్సుల్ ఫోటో కింద బుర్హాన్ సాని అనే పేరు ఇచ్చింది. గత రెండేళ్లుగా కశ్మీర్లో ఉగ్రవాద సంస్థల్లో చేరేవారి సంఖ్య పెరిగిపోతోంది. బాగా చదువుకున్న యువత కూడా ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 50 మంది యువకులు ఉగ్రవాద సంస్థలో చేరారు.
ఇదిలా ఉంటే పుల్వామా జిల్లా త్రాల్ ప్రాంతంలోని నౌదల్ గ్రామంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఉగ్రవాది బుర్హాన్ వానీ రెండవ వర్ధంతి సందర్భంగా.. చాలా మంది యువకులు బుర్హాన్ వానీకి నివాళులు అర్పించేందుకు ఆయన సొంత గ్రామంకు ర్యాలీగా బయలు దేరారు. అయితే భద్రతా దళాలు వారిని అడ్డుకున్నాయి. ఈ క్రమంలోనే భాష్పవాయువును భద్రతాదళాలు ప్రయోగించాయి. దీంతో ఘర్షణలు చెలరేగాయి. మరోవైపు బుర్హాన్ వానీ గ్రామం బెమ్దూరకు కొందరు ఉగ్రవాదులు చేరుకుని ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం గాల్లోకి కాల్పులు జరిపి బుర్హాన్ వాణీకి వందనం చేశారు.