సియాచిన్లో సోదరుల మృతి: 21 ఏళ్లకు ఒకరి శవం
ప్రపంచంలోనే అత్యంత ఎత్తున ఉండే యుద్ధభూమి. 18 వేల అడుగుల ఎత్తున, ఎముకలు కొరికే చలిలోనూ దేశ రక్షణే ధ్యేయంగా సైనికులు నిరంతరం కాపలా కాస్తుంటారు. అలా 21 ఏళ్ల క్రితం భద్రతా విధులు నిర్వర్తిస్తూ ప్రమాదవశాత్తు చనిపోయిన ఓ సైనికుడి మృతదేహాన్ని గత ఆదివారం కనుగొన్నామని అధికారులు వెల్లడించారు.
1993 ఫిబ్రవరిలో హవల్దార్ తుకారాం విఠోబా పాటిల్ సియాచిన్లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రమాదవశాత్తు ఒక లోయలో పడిపోయారు. ఆయన్ను రక్షించడానికి అధికారులు ప్రయత్నించినా ఫలితం లేదకపోయింది. దీంతో ఆయన మృతి చెందారు. కాగా, గత ఆదివారం సియాచిన్లో గస్తీ నిర్వహిస్తున్న సైనికులు పాటిల్ మృతదేహాన్ని కనుగొన్నారు.
అక్కడ ఉన్న శూన్య డిగ్రీల ఉష్ణోగ్రతల కారణంగా మృతదేహం ఏ మాత్రం చెడిపోలేదని వారు తెలిపారు. కాగా, మృతదేహంపై ఉన్న చొక్కా జేబులోని లెటర్, మెడికల్ సర్టిఫికెట్ ఆధారంగా మహారాష్ట్రకు చెందిన హవల్దార్ పాటిల్గా గుర్తించినట్లు వారు వెల్లడించారు.
కాగా, పాటిల్ సోదరుడు కూడా సైనిక విధుల నిర్వర్తిస్తూ 1987లో మంచులోయలోనే పడి మృతి చెందాడని అధికారులు తెలిపారు. కానీ ఇప్పటివరకు ఆయన మృతదేహాన్ని కనుగొనలేకపోయామన్నారు.పాటిల్ శవాన్ని అక్టోబర్ 12వ తేదీన 12వ మద్రాసు రెజిమెంట్ గస్తీ బృందం కనిపెట్టింది.
గత రెండు నెలల కాలంలో ఈ ప్రాంతంలో లభించిన మృతదేహాల్లో ఇది రెండోది. ఆగస్టులో 15 రాజ్పూత్ బెటాలియన్కు చెందిన హవల్దార్ గయా ప్రసాద్ మృతదేహం లభించింది. ఆశ్చర్యకరంగా పాకెట్లో దొరికిన లేఖ ఆధారంగానే గయా ప్రసాద్ మృతదేహాన్ని తుకారాం పాటిల్ను గుర్తించినట్లే గుర్తించారు.
నిజానికి తుకారాం పాటిల్ ముఖం గుర్తు పట్టరాకుండా ఉంది. కానీ అతని పాకెట్లో రెండు లేఖలు ఉన్నాయి. ఒకటి వ్యక్తిగతమైన లేఖ కాగా, మరోటి మెడికల్ ఇండక్షన్ చిట్. తుకారాం పాటిల్ సరఫరా చేస్తున్న సరుకులను అందుకుంటుండగా 17వేల అడుగుల లోతులో పడిపోయాడు.
అతని నడుంపై తాడు మరకలు ఉన్నాయి. ప్రసాద్ కూడా అదే రీతిలో లోయలో పడిపోయి మరణించాడు. పాటిల్కు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. పాటిల్ శవం దొరికిన విషయాన్ని సైన్యం సంగ్లీలోని వాసిగావ్ గ్రామంలోని కుటుంబ సభ్యులకు తెలియజేశారు.