Budget 2022: దేశంలో డిజిటల్ కరెన్సీ - క్రిప్టో లావాదేవీలపై 30 శాతం పన్ను : ఆర్దిక మంత్రి ప్రకటన..!!
దేశంలో డిజిటల్ కరెన్సీ ప్రవేశం పైన ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేసారు. ఆర్బీఐ ద్వారా దేశంలో డిజిటల్ కరెన్సీని ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ఆర్బీఐ ప్రతిపాదించే డిజిటల్ రూపీని 2022-23 ఆర్దిక సంవత్సరం నుంచి అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ప్రపంద దేశాల్లో విస్తరిస్తున్న బిట్ కాయిన్.. క్రిప్టో కరెన్నీ తో దేశీయంగానూ క్రిప్టో పైన కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనే చర్చ సాగింది. అయితే, ఆర్బీఐ ప్రవేశ పెట్టే డిజిటల్ కరెన్సీకే కేంద్రం మొగ్గు చూపింది.
ఆర్బీఐ డిజిటల్ రూపీ
ఈ డిజిటల్ కరెన్సీ ద్వారా ఆర్దిక వ్యవస్థకు ఉత్సాహం ఏర్పడుతుందని కేంద్ర మంత్రి ఆశాభావం వ్యక్తం చేసారు. అదే విధంగా మరో కీలక నిర్ణయం ప్రకటించారు. క్రిప్టో కరెన్సీ లావాదేవీల పైన 30 శాతం పన్ను విధిస్తున్నట్లుగా వెల్లడించారు. డిజిటల్ కరెన్సీ నిర్వహణ పైన పన్ను మినహా యింపు లేదని ఆర్దిక మంత్రి తేల్చి చెప్పారు. డిజిటల్ కరెన్సీతో డిజిటల్ బ్యాంకింగ్ అభివృద్ధి అవుతుందని నిర్మలా సీతారామన్ అన్నారు. బ్లాక్ చెయిన్ సాంకేతికతతో ఆర్బీఐ ఇందుకోసం రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆమె వెల్లడించారు.
ఆదాయపు పన్ను ఊసే లేకుండా
''యానిమేషన్ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తాం. ప్రత్యేక ఆర్థిక మండళ్ల చట్టం స్థానంలో నూతన చట్టం తీసుకొస్తాం'' అని మంత్రి చెప్పారు. ఇక, ఆదాయపన్ను రిటర్న్ల దాఖలులో నవీకరణఆర్థిక సంవత్సరం నుంచి రెండేళ్ల వరకు వ్యక్తిగత ఐటీ రిటర్న్లు దాఖలు చేసుకోవచ్చుసహకార సంస్థలకు కంపెనీలతో సమానంగా ఆల్టర్నేట్ పన్నుప్రత్యామ్నాయ పన్ను 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గింపు నిర్ణయం తీసుకున్నారు. ఇక, ఆదాయపు పన్నుల విషయంలో బడ్జెట్ లో ఎక్కడా ఎటువంటి ప్రస్తావన చేయలేదు.
క్రిప్టో లావాదేవీలపై పన్ను
క్రిప్టో తరహా పెట్టుబడుల పైన మాత్రం కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ తాజా నిర్ణయంతో డిజిటల్ ఆస్తుల నిర్వహణ పైన కొత్తగా 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక, రాష్ట్రాలకు మాత్రం ఆర్దిక మంత్రి కొంత ఊరట నిచ్చే అంశం ప్రకటించారు. రాష్ట్రాలకు కేంద్రం నుంచి వడ్డీ రహిత రుణ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. ఇక, ఆదాయ నిర్వహణకు సంబంధించి పెద్దగా ప్రభావితం చేసే ప్రకటనలు బడ్జెట్ ప్రసంగంలో లేనట్లుగానే కనిపిస్తోంది.