38,800 మంది ఉపాధ్యాయులు, సిబ్బందిని భర్తీ చేస్తాం: నిర్మలా సీతారామన్
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (ఈఎంఆర్ఎస్)లోని 740 పాఠశాలలకు 38,800 మంది ఉపాధ్యాయులు, సహాయక సిబ్బందిని కేంద్రం నియమిస్తుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం శుభవార్త తెలిపారు. తన బడ్జెట్ 2023 ప్రసంగంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (ఈఎంఆర్ఎస్)లోని 740 పాఠశాలలకు 38,800 మంది ఉపాధ్యాయులు, సహాయక సిబ్బందిని కేంద్రం నియమిస్తుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
వచ్చే మూడేళ్లలో దేశంలోని 740 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 3.5 లక్షల మంది ఆదివాసీ విద్యార్థులకు విద్యాబోధన అందించడమే లక్ష్యంగా ఈ భారీ రిక్రూట్ మెంట్ చేపట్టనున్నట్లు వెల్లడించారు. సీతారామన్ తన ఐదవ బడ్జెట్లో బలహీన గిరిజన సమూహాల కోసం కీలక ప్రణాళికలను ప్రకటించారు.
ముఖ్యంగా బలహీన గిరిజన సమూహాల (PVTGs) సామాజిక-ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి, ప్రధాన మంత్రి అభివృద్ధి మిషన్ ప్రారంభించన్నాం. ఇది PVTG కుటుంబాలు, నివాసాలను సురక్షిత గృహాలుగా, స్వచ్ఛమైన తాగునీరు, పారిశుధ్యం వంటి ప్రాథమిక సౌకర్యాలను కల్పిస్తుంది. విద్య ఆరోగ్యం, పోషణ, రహదారి, టెలికాం కనెక్టివిటీ, స్థిరమైన జీవనోపాధి అవకాశాలను మెరుగుపరుస్తామని పేర్కొన్నారు.
షెడ్యూల్డ్ తెగల కోసం అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక కింద రాబోయే 3 సంవత్సరాలలో మిషన్ను అమలు చేయడానికి ₹ 15,000 కోట్ల మొత్తాన్ని అందుబాటులో ఉంచుతామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇది ఇలావుండగా, దేశంలో కొత్తగా 157 కొత్త నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారమన్ వెల్లడించారు.