మీరైనా..: ‘ముఖ్యమంత్రికి రక్తంతో లేఖ రాసిన అమ్మాయి’
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ 15ఏళ్ల అమ్మాయి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు రక్తంతో ఉత్తరం రాసింది. తన తల్లిని సజీవ దహనం చేసిన హంతకులపై చర్యలు తీసుకోవాలని సీఎం కోరింది. ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, తమ కతమకు న్యాయం చేయాలని విన్నవించింది.
సీఎం అఖిలేష్ యాదవ్కు ఆ లేఖ రాసింది బులంద్ షహర్ కు చెందిన 9వ తరగతి చదువుతున్న లితికా బన్సల్(15). తన తల్లిని చంపినవారి అంతు చూడాలని కోరింది. ఈ ఏడాది జూన్ 14న బులంద్షహర్లో లితికా తల్లి అనూ బన్సల్ను సజీవదహనం చేశారు.
తనతో పాటు తన 11ఏళ్ల సోదరి తన్యా ఎదుటే ఈ దారుణానికి పాల్పడ్డారంటూ లితికా అఖిలేష్కు రాసిన లేఖలో పేర్కొంది. తన తల్లిని చంపవద్దని ఎంత బతిమిలాడినా వినకుండా చంపేశారని రాసింది.
అబ్బాయిలకు జన్మనివ్వలేదనే కారణంతో తన బాబాయిలే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని వెల్లడించింది. 100నెంబర్కు ఫోన్ చేసినా పోలీసులు స్పందించలేదని తెలిపింది. తర్వాత ఎప్పుడో వచ్చిన పోలీసులు తన తల్లి ఆత్మహత్య చేసుకున్నట్లుగా కేసు నమోదు చేశారని లితికా సీఎంకు తెలిపింది.
తన తల్లిని చంపిన దోషులను కఠినంగా శిక్షించి తమకు న్యాయం దక్కేలా చూడాలని విన్నవించింది. అప్పటికే ఒకసారి లేఖ రాశామని, స్పందన రాకపోవడంతో మరోసారి తన రక్తంతో రాస్తున్నానని పేర్కొంది. ఈసారైనా తమకు న్యాయం చేయాలని కోరింది.