మండుతున్న కర్ణాటక: భగ్గుమన్న బెంగళూరు రూరల్: బస్సులు దగ్ధం
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి డీకే శివకుమార్ అరెస్ట్ వ్యవహారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. డీకే శివకుమార్ అరెస్టుకు నిరసనగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు ఇచ్చిన బంద్ పిలుపు పలుచోట్ల విధ్వంసానికి తెర తీసింది. ఆయన అనుచరులు, కార్యకర్తలు విధ్వంసానికి దిగారు. కర్ణాటక ఆర్టీసీ బస్సులకు నిప్పులు పెట్టారు. వాటి అద్దాలను ధ్వంసం చేశారు. డీకే శివకుమార్ కు గట్టి పట్టు ఉన్న ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పాఠశాలలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. బెంగళూరు రూరల్, రామనగర జిల్లాలపై బంద్ ప్రభావం కనిపిస్తోంది. డీకే ప్రాతినిథ్యం వహిస్తోన్న కనకపుర అసెంబ్లీ నియోజకవర్గంలో పలుచోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు, ఆయన అనుచరులు బెంగళూరు-మైసూరు ప్రధాన రహదారిపై బైఠాయించారు. నిరసన ప్రదర్శనలకు దిగారు. ఫలితంగా- వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.

ట్రబుల్ షూటర్ ను ఇబ్బందులు పెడితే..
కర్ణాటక కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్ గా పేరున్న డీకే శివకుమార్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ కార్యాలయం అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సుమారు 600 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను ఆయన అక్రమంగా కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొద్దిరోజులుగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులను ఆయనను ప్రశ్నిస్తూ వచ్చారు. రెండురోజుల కిందటే ఆయనను అరెస్టు చేశారు. కాంగ్రెస్ లో కీలక నాయకుడిగా, అనేక గండాల నుంచి పార్టీని గట్టెక్కించిన నాయకుడిగా డీకే శివకుమార్ కు పేరుంది. ఆయనను ఇబ్బందుల్లో పడేయటం వల్ల రాజకీయంగా గానీ, ఆర్థికంగా గానీ కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతుందని ఉద్దేశంతో భారతీయ జనతాపార్టీ ఆయనపై ఈడీని ప్రయోగించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీకే శివకుమార్ అరెస్ట్ వ్యవహారాన్ని కాంగ్రెస్ తప్పు పడుతోంది. బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శిస్తోంది. ఆయన అరెస్టుకు నిరసనగా బంద్ కు పిలుపునిచ్చింది.

రెండు జిల్లాలపై బంద్ ప్రభావం..
బెంగళూరు రూరల్, రామనగర జిల్లాలపై బంద్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. బుధవారం ఉదయం నుంచి బెంగళూరు నుంచి ఈ రెండు జిల్లాల్లోని ప్రధాన పట్టణాలకు కర్ణాటక ఆర్టీసీ అధికారులు బస్సు సర్వీసులను నిలిపివేశారు. డీకే శివకుమార్ ప్రాతినిథ్యం వహిస్తోన్న కనకపుర సహా హోసహళ్లి, హారోహళ్లి, మాగడి, బిడది, హుళియూరు దుర్గ వంటి ప్రాంతాలకు బస్ సర్వీసులను నిలిపివేశారు. ఫలితంగా- ఈ మార్గంలో రాకపోకలు సాగించే విద్యార్థులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కనకపుర పట్టణ శివార్లలో డీకేశీ అనుచరులు 10కి పైగా కేఎస్ఆర్టీసీ, ఒక ఎస్ఆర్ఎస్ ప్రైవేట్ బస్సును ధ్వంసం చేశారు. వాటి అద్దాలను పగులగొట్టారు. మరి కొన్నింటిని నిప్పు అంటించారు. మూడు బస్సులు పూర్తిగా మంటల్లో దగ్ధమయ్యాయి. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన దృష్ట్యా ఈ రెండు జిల్లాలకు పెద్ద ఎత్తున పోలీసులు బలగాలను తరిలిస్తున్నారు.

పాఠశాలలు, విద్యాసంస్థలకు సెలవు..
కాంగ్రెస్ ఇచ్చిన బంద్ పిలుపు నేపథ్యంలో.. పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉన్నందున.. బెంగళూరు రూరల్, రామనగర జిల్లా పాలనా యంత్రాంగం ముందుగానే అప్రమత్తమైంది. రామనగర జిల్లాలోని కొన్ని పట్టణాల్లో పాఠశాలలు, విద్యాసంస్థలను మూసివేశారు. ప్రభుత్వ కార్యాలయాలు కూడా పాక్షికంగానే పనిచేస్తున్నారు. కనకపుర పట్టణం స్తంభించిపోయింది. కనకపుర డిపో నుంచి ఒక్క బస్సు కూడా బయటికి రాలేదు. ఈ తెల్లవారు జామున 6 గంటల నుంచే కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్ల మీదికి వచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వాహనాలను తిరగనివ్వలేదు. పలువురు కార్యకర్తలు కనకపుర ఆర్టీసీ డిపో గేటు బైఠాయించారు. కనకపుర మీదుగా రాకపోకలు సాగించే ఇతర ప్రాంతాల బస్సుల రాకపోకలను సైతం అడ్డుకున్నారు. రామనగర శివార్లలో కాంగ్రెస్ కార్యకర్తలు బెంగళూరు-మైసూరు ప్రధాన రహదారిని దిగ్బంధించారు. ఫలితంగా వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. సుమారు అయిదు కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి.












Click it and Unblock the Notifications