2030 నాటికి భారత్ రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది: మోడీ
2030 నాటికి భారత దేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో భారత్ మాత్రం స్థిరమైన ఆర్థిక వ్యవస్థ కలిగి ఉందని ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండ్, ప్రపంచ బ్యాంకులు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నాయని చెప్పారు మోడీ. పెట్రోటెక్ 2019లో మోడీ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచంలోనే భారత్ ఆరో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉందని ప్రధాని చెప్పారు.
స్టాండర్డ్ చార్టర్డ్ ఇచ్చిన నివేదిక ప్రకారం 2030నాటికి భారత్ రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని వెల్లడించింది. అంతేకాదు చైనా అమెరికాను దాటుకుని తొలిస్థానంలో నిలుస్తుందని నివేదిక స్పష్టం చేసింది. అమెరికా మూడో స్థానానికి పడిపోతుందని వివరించింది. అస్థిరంగా ఉన్న ముడిచమురు ధరలపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని మోడీ. చమురు కంపెనీలకు వినియోగదారులు ఇద్దరూ సంతృప్తి చెందేలా ధరలు నిర్ణయించాలని ప్రధాని మోడీ చెప్పారు. చమురు గ్యాస్ ధరల్లో పారదర్శకతతో వ్యవహరించాలని అప్పుడే అవసరాలు తీరుతాయని చెప్పారు.
ఎనర్జీ సప్లై, ఆయిల్ వినియోగం రోజురోజుకు మారుతున్నాయని చెప్పిన ప్రధాని ఎనర్జీ కంపెనీలను భారత్ ఆకట్టుకుంటోందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఆయిల్ వినియోగం 2040 నాటికి రెట్టింపు అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎనర్జీ రంగంలో ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లను చర్చించేందుకు పెట్రోటెక్ సదస్సు మంచి వేదికగా నిలిచిందని ప్రధాని అన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 95 దేశాలనుంచి ఎనర్జీ మంత్రులు హాజరయ్యారు. వీరితో పాటు 7వేల మంది అతిథులు హాజరై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.