నేటితో ముగియనున్న గుజరాత్ తొలిదశ ప్రచారం-బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తున్న కాంగ్రెస్, ఆప్ !
గుజరాత్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. తొలిదశ ఎన్నికలు ఎల్లుండి జరగనుండగా.. రెండో దశ ఎన్నికలు డిసెంబర్ 5న జరుగుతాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం భారీ ఎత్తున సాగుతోంది. ముఖ్యంగా ఈసారి ఎలాగైనా అధికారం నిలబెట్టుకోకపోతే ఆ ప్రభావం 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోడీపై పడుతుందని భావిస్తున్న బీజేపీ.. తీవ్రంగా పోరాడుతోంది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ ప్రచారానికి ఇవాళ సాయంత్రం తెరపడనుంది. తొలిదశలో భాగంగా 89 అసెంబ్లీ సీట్లలో ఎన్నికలు జరగనున్నాయి. రెండోదశలో మరో 93 సీట్లకు ఎన్నికలు ఉంటాయి. ఇప్పటికే తొలిదశ ఎన్నికలు జరిగే అసెంబ్లీ నియోజకవర్గాల్ని ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సుడిగాలి వేగంతో చుట్టేస్తున్నారు. ఈసారి బీజేపీ అధికారం నిలబెట్టుకోవడంలో విఫలమైతే ఆ ప్రభావం కచ్చితంగా వీరిద్దరిపైనే ఉండబోతోంది. దీంతో మోడీ-షా ద్వయం వీటిని ప్రతిష్టాత్మంగా భావిస్తున్నారు.

ఇక గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ ల మధ్య ముక్కోణపు పోరు సాగుతోంది. ఇందులో బీజేపీ మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తుండగా..దానికి అడ్డుకట్టే వేసేందుకు కాంగ్రెస్, ఆప్ పోరాడుతున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల చీలికపై బీజేపీ భారీ ఆశలే పెట్టుకుంది. కానీ ఇప్పటివరకూ వెలువడిన సర్వేల్లో ఆప్ పరిస్ధితి ఏమంత బాగోలేదు. దీంతో మరోసారి రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోరు జరగబోతోందనే అంచనాలు కూడా ఉన్నాయి. అయితే కాంగ్రెస్ అవకాశాల్ని ఆప్ గండికొడితే మాత్రం మరోసారి కచ్చితంగా బీజేపీ గెలుపు ఖాయమనుకోవచ్చు.












Click it and Unblock the Notifications