మోడీ ఎఫెక్ట్: పొత్తుకి సిద్ధమని మమత, షాకిచ్చిన లెఫ్ట్
కోల్కతా: దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హవా ఇంకా కనిపిస్తున్నట్లుగా ఉంది. బీజేపీకి, మోడీకి చెక్ పెట్టేందుకు ఇప్పటికే బీహార్లో కాంగ్రెస్, జెడీయు, ఆర్జేడీ చేతులు కలిపాయి. యూపీలో బీఎస్పీతో చేతులు కలిపేందుకు ఎస్పీ మొగ్గు చూపినా మాయావతి నో చెప్పారు. తాజాగా పశ్చిమ బెంగాల్లో ముప్పయ్యేళ్లుగా కమ్యూనిస్టుల పైన పోరాడిన మమతా బెనర్జీ కూడా వారితో పొత్తు కోసం సిద్ధమంటున్నారు. ఇదంతా మోడీ మాయేనని వ్యాఖ్యానిస్తున్నారు.
రాజకీయాల్లోనూ.. ప్రజాస్వామ్యంలోనూ ఎవరూ అస్పృశ్యులు కాదని, సీపీఎంతో పొత్తుకు తాము కూడా వ్యతిరేకం కాదని అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. తాము అన్ని తలుపులు తెరిచి ఉంచుకుంటామని, అవకాశం వచ్చినప్పుడు పొత్తు పెట్టుకునే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.
పొత్తుకు సంబంధించి సీపీఎం నుంచి ప్రతిపాదన వస్తే దానిని పార్టీలో చర్చిస్తామని, తమ పార్టీలో వివిధ స్థాయులు ఉన్నాయని, వాటిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ పట్టు సాధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీని ఎదుర్కోవడానికి బీహార్లో లాలు-నితీశ్ పొత్తు తరహాలో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా అన్న విలేకరుల ప్రశ్నలకు ఆమె ఈ మేరకు జవాబు ఇచ్చారు.
ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన లాలు-నితీశ్ కూటమిని ఆమె అభినందించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే వాళ్లు పొత్తు పెట్టుకుని ఉంటే బీహార్లోని అన్ని స్థానాల్లోనూ విజయం సాధించి ఉండేవారని చెప్పారు. రాజకీయాల్లో ఎవరూ అస్పృశ్యులు కారని, అసెంబ్లీ ఎన్నికల్లో తాము కూడా ఎస్యూసీఐతో పొత్తు పెట్టుకున్నామన్నారు. బీజేపీని ఆమె రాజకీయ కాలుష్యంగా అభివర్ణించారు.
తాను బీజేపీ గురించి ఆందోళన చెందడం లేదని, అసెంబ్లీ ఎన్నికల్లో ముందు వాళ్లను ఐదు సీట్లు గెలుచుకోనివ్వమనండని, ఆ తర్వాత వాళ్లు మొత్తం 294 సీట్ల గురించి మాట్లాడుకోవచ్చునని, వాజపేయి కోసం తాను ఆ పార్టీతో కలిసి పని చేశానని, ఇప్పుడక్కడ కొత్త నాయకత్వం వచ్చిందని, వాళ్లు మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.
షాకిచ్చిన సీపీఎం
బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు తృణమూల్తో చేతులు కలిపే ప్రసక్తే లేదని సీపీఎం సహా వామపక్షాలు తేల్చి చెప్పాయి. తృణమూల్ లేదా మమతా బెనర్జీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని, ఆమె విధానాలు, రాజకీయాల కారణంగానే బీజేపీ పశ్చిమ బెంగాల్లోకి చొచ్చుకు వస్తోందని, మతతత్వ బీజేపీతో పోరాడాల్సి వస్తే తాము సొంతంగానే పోరాడతామని సీపీఐ నేత గురుదాస్ దాస్గుప్తా స్పష్టం చేశారు.
అయితే, 1998లోనే బీజేపీతో మమతా బెనర్జీ చేతులు కలిపారని, అప్పుడే తొలిసారిగా బీజేపీని పశ్చిమ బెంగాల్కు తీసుకొచ్చారని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు, బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సూర్యకాంత్ మిశ్రా తప్పుబట్టారు. కాగా మమతా బెనర్జీ వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్లో తమ ఎదుగుదలను సూచిస్తున్నాయని, బెంగాల్లో బీజేపీ పట్టు సాధిస్తోందని ఆమె నిర్థారించారని బీజేపీ జాతీయ కార్యదర్శి సిద్ధార్థనాథ్ వ్యాఖ్యానించారు.