కర్నాటకంతో మరోసారి ఫిరాయింపులపై చర్చ.. చట్టం ఏం చెబుతోంది.. మరి నేతలు చేస్తున్నదేంటి?
బెంగళూరు: కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభం చివరి అంకానికి చేరుకుంది. గురువారం బలపరీక్షను ఎదుర్కొనాల్సి ఉన్న కుమారస్వామి సర్కార్.. చివరి నిమిషంలో ఈ గండం నుంచి తప్పించుకుంది. అది తాత్కాలికమే. శుక్రవారం మరోసారి అసెంబ్లీ సమావేశం కానున్న నేపథ్యంలో- బల పరీక్ష అంశం వెంటాడుతూనే వస్తోంది. కాంగ్రెస్కు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు సభకు హాజరు కాలేదు. వారంతా తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వాటిని స్పీకర్ ఇంకా ఆమోదించాల్సి ఉంది. బలపరీక్ష సందర్భంగా గైర్హాజరైన సభ్యులను పరిగణనలోకి తీసుకోకపోతే- కుమారస్వామి ప్రభుత్వం మునగడం ఖాయమే!

తెరమీదికి వచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టం
కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభ పర్వం ఫలితంగా- ఫిరాయింపుల నిరోధక చట్టం మరోసారి చర్చనీయాంశమైంది. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ను ఉల్లంఘించడమే అవుతుందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. విప్ను జారీ చేసినప్పటికీ- కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు సభకు హాజరు కాలేదు. ఫలితంగా ఈ చట్టం ప్రకారం వారిని అనర్హులుగా పరిగణించడానికి అవకాశం చిక్కినట్టే అవుతుంది. ఒక్కసారి అనర్హత వేటు పడిన సభ్యుడు.. ఆ తరువాత జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు ఉండదు. మంత్రి పదవులను అనుభవించే అవకాశమూ దక్కదు. ఆ శాసనసభ గడువు ముగిసిన తరువాతే ఆయన ఎన్నికల క్షేత్రం పోరాడటానికి వెసలుబాటు ఉంటుంది.

ఒక్కసారి అనర్హత వేటు పడితే..
1985లో ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన క్లాజును రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లో పొందుపరిచారు. ఒక పార్టీ గుర్తు మీద ఎన్నికైన తరువాత.. ఆ శాసనసభ కాల పరిమితి ముగియకుండానే ఇంకో పార్టీలో చేరితే- సదరు శాసన సభ్యుడు అనర్హత వేటుకు గురికావాల్సి ఉంటుందనేది దీని సారాంశం. అయిదేళ్ల కాలపరిమితి ముగిసేంత వరకూ అనర్హత వేటు పడిన సభ్యుడు ఉప ఎన్నికల్లో పోటీ చేయడానిక అర్హుడు కాదు. పార్టీని ఫిరాయించినా, విప్ను ధిక్కరించినా.. ఈ వేటు తప్పదనే చెబుతోంది ఫిరాయింపుల నిరోధక చట్టం.

తెలంగాణ, గోవాల్లో చోటు చేసుకున్నది ఇదే..
ఫిరాయింపుల పర్వంలో ఒక పార్టీ నుంచి ఎన్నికైన వారిలో ముప్పావు వంతు సభ్యులు మూకుమ్మడిగా రాజీనామాలు చేసిన సందర్భంలో ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు. ముప్పావు వంతు సభ్యులు మూకుమ్మడిగా రాజీనామాలు చేయడం గానీ, వేరే పార్టీకి మద్దతు ఇవ్వడం గానీ జరిగితే- తద్వారా అసలు పార్టీ సభలో ఉనికిని కోల్పోతుంది. రాజీనామా చేసిన లేదా వేరే పార్టీకి మద్దతు ఇచ్చిన సభ్యులు ఉన్న కూటమినే అసలు పార్టీగా గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. గోవాలో గానీ మన తెలంగాణలో గానీ ఇదే రకమైన సందర్భాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. గోవాలో కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం 15 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. వారిలో పదిమంది బీజేపీకి మద్దతు ఇచ్చారు. మరో అయిదు మంది కాంగ్రెస్లోనే ఉండిపోయారు. తమనే అసలైన కాంగ్రెస్ సభ్యులుగా గుర్తించాలని కోరుతూ పదిమంది ఎమ్మెల్యేలు స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. దీనితో కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీలో విలీనమైనట్లు అధికారికంగా ప్రకటించారు.
స్పీకర్కు వెసలుబాటు ఇచ్చిన సుప్రీంకోర్టు
బలపరీక్షను నిర్వహించడానికి సుప్రీంకోర్టు తప్పనిసరి చేసినప్పటికీ.. ఫలానా గడువులోగా ముగించాలంటూ స్పీకర్కు ఎలాంటి ఆదేశాలను ఇవ్వలేదు. ఇది కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి ఇది ఊరట కలిగించే అంశం. ఈ వెసలుబాటు కల్పించడం వల్లే కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ బలపరీక్ష నిర్వహణను గురువారం నాటికి ముగించలేదు. శుక్రవారానికి వాయిదా వేశారు. ఎప్పుడు పూర్తి చేయాలనే విచక్షణాధికారాన్ని సుప్రీంకోర్టు స్పీకర్కే వదిలి పెట్టింది. అదే సమయంలో రాజీనామా చేసిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు శాసనసభలో అడుగు పెట్టే అర్హతను కూడా కోల్పోయారని సుప్రీంకోర్టు సూచించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications