రెండు కుర్చీలు శశికళకే: తమిళనాడులో కొత్త అమ్మ
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇంత కాలం కుర్చున్న కుర్చీల్లో నెచ్చెలి శశికళను కూర్చోబెట్టడమే లక్షంగా అన్నాడీఎంకే పార్టీలోని కొందరు నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళనాడు సీఎం కుర్చీ, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి కుర్చీలు శశికళకు ఇచ్చేయాలని అంటున్నారు.
అన్నాడీఎంకే అనావాయితీ ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంటున్నామని కొందరు సీనియర్ నాయకులు చెబుతున్నారు. జయలలిత మరణించిన తరువాత ఎలాంటి వివాదానికి తావు లేకుండా ఏకగ్రీవంగా పన్నీర్ సెల్వం ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు.
అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి విషయంలో ఇటీవల తర్జనభర్జనలు జరిగినా చివరికి పార్టీ సీనియర్ నాయకులు ఏకతాటిపై నిలిచి నెచ్చెలి శశికళకు మద్దతు పలుకుతోంది. వారం రోజుల నుంచి పలువురు మంత్రులు ప్రజా సమస్యలను పక్కన పెట్టి ఇదే విషయంలో తీర్మానాలు చేసుకుంటూ వస్తున్నారు.
అయితే గత రెండు రోజుల నుంచి అన్నాడీఎంకే పార్టీలో ఒక్క సారిగా సీన్ రివర్స్ అయ్యింది. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు సీఎం పదవి కూడా మీరే తీసుకోండి చిన్నమ్మా అంటూ ఆమె కాళ్ల మీదపడిపోతున్నారు.
ప్రస్తుతం సీఎంగా ఉన్న పన్నీర్ సెల్వం కేబినేట్ లోని మంత్రి వర్గ సహచరులు కూడా ఇప్పుడు చిన్నమ్మ భజన చేస్తున్నారు. చిన్నమ్మ శశికళ సీఎం కావాలంటూ పట్టుబట్టి ఒంటి కాలిమీద నిలబడుతున్నారు.
అయితే మీరు సీఎం పన్నీర్ సెల్వంకు వ్యతిరేకమా అని మీడియా ప్రశ్నిస్తే తమిళనాడు రెవెన్యూ శాఖా మంత్రి ఉదయ్ కుమార్ దిమ్మతిరిగే వివరణ ఇచ్చారు. పన్నీర్ సెల్వం మీద మాకు ఎలాంటి విభేదాలు లేవని, ఆయన మీద మాకు అసంతృప్తి లేదని అంటున్నారు.
జయలలిత క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలోనే పన్నీర్ సెల్వంకు సీఎంగా బాధ్యతలు అప్పగించారని గుర్తు చేస్తున్నారు. అయితే అన్నాడీఎంకేకి నాయకత్వం (ప్రధాన కార్యదర్శి) వహించే వారు సీఎంగా పని చెయ్యాలని పార్టీలో అనవాయితీగా వస్తున్నదని ఇదే సమయంలో గుర్తు చేశారు.
సీఎంగా పని చేస్తున్న పన్నీర్ సెల్వం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిలో ఉండే శశికళ దగ్గరకు పదేపదే వస్తే ప్రజల్లో విమర్శలు తలెత్తే ప్రమాదం ఉందని రెవెన్యూ శాఖా మంత్రి ఉదయ్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
రెండు పదవుల్లో శశికళ ఉండటమే మంచిదని భావించే మంత్రులు అంతా ఈ నిర్ణయానికి వచ్చామని ఉదయ్ కుమార్ వివరించారు. ఇదే సమయంలో జయలలిత మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన 127 మంది మృతుల కుటుంబ సభ్యులకు తలా రూ. 3 లక్షలు అందజేస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.