45 ఏళ్లలో నా భార్యతో కూడా తాగించలేదు: గంగూలీ
కోల్కతా: మద్యం సేవించాలని ఇంత వరకూ ఏ మహిళను కూడా బలవంత పెట్టలేదని, కనీసం తన భార్యను కూడా ఈ విషయంలో బలవంతం చేయలేదని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఏకె గంగూలీ తెలిపారు. తన వద్ద పనిచేస్తున్న జూనియర్ న్యాయవాదిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన, ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు.
బుధవారం తన నివాసంలో ఏకె గంగూలీ మీడియాతో మాట్లాడుతూ.. తన రాజీనామాను నేరం అంగీకరించనినట్లుగా భావించకూడదని ఆయన కోరారు. తాను ఎవరిపైనా లైంగిక వేధింపులకు పాల్పడలేదని ఆయన తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తన కుటుంబ సభ్యులకు చాలా కష్టంగా మారాయని ఆయన చెప్పారు.
తాను ఓ మహిళను మద్యం సేవించాలని బలవంతం చేయగలనా అని గంగూలీ ప్రశ్నించారు. తన 45ఏళ్ల జీవితంలో కనీసం తన భార్యను కూడా మద్యం సేవించాలని ఎప్పుడూ బలవంతపెట్టలేదని చెప్పారు. మద్యం విషయం పక్కన పెట్టండి... కనీసం తాను టీ, కాఫీ తీసుకోవాలని కూడా బలవంతపెట్టలేనని తెలిపారు. లైంగిక ఆరోపణలపై స్పందిస్తూ.. తన సహాయక జూనియర్ న్యాయవాదిపై న్యాయపరమైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, తనకు మంచే జరగాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
తన శిష్యురాలు(సహాయక న్యాయవాది)పై పరువు నష్టం దావా వేయలేనని, దాని కన్నా తాను జైలుకు వెళ్లడానికే మొగ్గు చూపుతానని గంగూలీ తెలిపారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తాను రాష్ట్ర మానవ హక్కుల ఛైర్మన్గా కొనసాగడం ఇష్టం లేదని, ఆమె, ఆమె పార్టీపై ఆరోపణలు వస్తాయనే తనను పదవిని నుంచి తొలగించాలని చూసినట్లు ఆయన తెలిపారు. కాగా గంగులీపై ఆరోపణలో రావడంతో మమతా బెనర్జీ.. గంగూలీని తన పదవి నుంచి తొలగించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తి చేశారు.
గుంగులీపై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు ముగ్గురు న్యాయమూర్తులతో నియమించిన కమిటీ.. గంగూలీ బాధితురాలి పట్ల స్వాగతించలేని విధంగా ప్రవర్తించారని, అది లైంగిక వేధింపుల కిందికే వస్తుందని తెలిపింది. డిసెంబర్, 2012లో తనకు బలవంతంగా మద్యం తాగించేందుకు ప్రయత్నించారని, తన చేతిపై ముద్దు పెట్టుకున్నారని గంగూలీపై బాధితురాలు విచారణ కమిటీకి తన వాదనను వినిపించారు. తనను ప్రేమిస్తున్నానని చెప్పి, తన గదిని పంచుకోవాలని కోరినట్లు కూడా ఆమె కమిటీకి తెలిపింది.